– ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి
– ధ్రువీకరించిన బస్తర్ ఐజీ సుందర్ రాజ్
నవతెలంగాణ-చర్ల
తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలపై రక్తపుటేరులు పారాయి. మంగళవారం రాత్రి సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట కొండలపై మావోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు. గత పక్షం రోజులుగా జరుగుతున్న దాడి తర్వాత ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లో, సైనికులు తొలి రెండు రోజుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులను, తర్వాత ఒకరిని మొత్తం 26 మందిని హతమార్చారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద మావోయిస్టు ఆపరేషన్
భద్రతా దళాలు కర్రెగుట్టలోని దట్టమైన కొండలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా ప్రణాళికాబద్ధమైన, శక్తివంతమైన ఆపరేషన్ను ప్రారంభించాయి. బుధవారం ఉదయం వరకు జరిగిన ఈ చర్యలో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. సైనికులు ఇప్పటికే రెండు కొండలను స్వాధీనం చేసుకోగా త్వరలో మూడవ చివరి కొండను కూడా స్వాధీనం చేసుకోగలుగుతామని, దాంతో ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంత మవుతుందని తెలిపారు. ఈ ఆపరేషన్ను సీఆర్పీఎఫ్ ఐజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఢిల్లీ నుంచి, ఛత్తీస్గఢ్ ఏడీజీ నక్సల్స్ ఆప్స్ వివేకానంద సిన్హా, సీఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ ఐజీ పి.సుందర్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో డీఆర్జీ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు 22 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
కర్రెగుట్టలపై పారిన రక్తపుటేర్లు
- Advertisement -
- Advertisement -