సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్
నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఇమ్రాన్ అన్నారు. బుధవారం తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా సీపీఐ జిల్లా కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరిస్తే సహించబోమని, సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్ర చెరిగిపోదని, ఆ పోరాట స్ఫూర్తి ఎప్పుడు ఈ ప్రాంత ప్రజల గుండెల్లో తిరుగుబాటు చైతన్యాన్ని కలిగిస్తుందన్నారు.
మంచి ఉన్నంతకాలం అరుణ పతాకం రెపరెపలాడుతూనే ఉంటుందన్నారు. కమ్యూనిస్టుల పార్టీ పేరు ఉచ్చరించడానికి పాలకులకు భయమని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. 1947 సెప్టెంబర్ 11న రావి నారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, మాఖ్దుo మొయినుద్దీన్ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజు నిజాం తాబేధారలుగా, జాగిర్దారులు, దొరలు, దేశముక్లు, భూస్వాములు, విచ్చలవిడిగా దోపిడీ దౌర్జన్యాలు పెట్టి చాకిరికి వ్యతిరేకంగా సమరశంఖం పూరించారన్నారు. 4 వేల మంది అమరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి నిజం రాజుని గద్దె దించి తెలంగాణను భారత యూనియన్ లో విలీనం చేశారన్నారు. నాటి కమ్యూనిస్టు నాయకుల పోరాట ఫలితంగానే 10 లక్షల ఎకరా భూమి ప్రజల సొంతమైందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గణబోయి వెంకటేష్, నాయకులు చింతల మల్లేష్, ముంతాజ్ బేగం, గౌరవంతుల శ్రీనివాస్, మడుగుల స్వామి, ముదిగొండ బసవయ్య, మామిండ్ల సత్యనారాయణ, బొజ్జ గణేష్, పిన్నం జగన్, నర్సింహా, కృష్ణ, రాములు పాల్గొన్నారు.