నవతెలంగాణ-హైదరాబాద్: రానున్న దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులకు తీపికబురు చెప్పింది. పండుగల సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. టీజీఎస్ఆర్టీసీ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఏకంగా 7,754 స్పెషల్ బస్సులను నడపనుంది. ఈ బస్సులలో, 377 సర్వీసులకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది. దీంతో ప్రయాణికులు ఇంటి నుంచే తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు, తద్వారా కౌంటర్ల వద్ద నిరీక్షణ తప్పించుకోవచ్చు.
సద్దుల బతుకమ్మ (సెప్టెంబర్ 30), దసరా (అక్టోబర్ 2) రోజుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ రద్దీని తట్టుకోవడానికి ప్రధాన బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వస్తాయి. అలాగే, పండుగలు ముగిసిన తర్వాత తిరిగి నగరానికి వచ్చేవారి సౌకర్యార్థం అక్టోబర్ 5, 6 తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు. మరిన్ని వివరాల కోసం టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా సమీపంలోని బస్టాండ్లో విచారించవచ్చు.