నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ను ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం నుంచి వీటికి సంబంధించిన విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టోర్ బయట కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరగ్గా.. ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకున్నారు. ఇక, దిల్లీలోని స్టోర్ ముందు కూడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను కొనుగోలు చేసిన అమాన్ మెమన్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తంచేశాడు. గత ఆరు నెలలుగా దీన్ని కొనుగోలు చేసేందుకు ఎదురుచూశానని పేర్కొన్నాడు. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రోమ్యాక్స్ మోడళ్లను ఇటీవల యాపిల్ తీసుకొచ్చింది. యాపిల్ ఈసారి బేస్ మోడళ్లను 256జీబీ వేరియంట్లో తీసుకొచ్చింది. ఐఫోన్ 17 ధర రూ.82,900 కాగా ఎయిర్మోడల్ ధర రూ.1,19,900గా కంపెనీ నిర్ణయించింది. ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,34,900గా పేర్కొంది. అలాగే ప్రో మ్యాక్స్ ధర రూ.1,49,900గా ఉంది.