నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రపతి పాలన తర్వాత ప్రశాంతంగా ఉన్న మణిపూర్ రాష్ట్రం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఎవరూ ఉహించిన విధంగా మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లా నంబోల్ సమీపంలోని సబల్ లెకై ప్రాంతంలో అసోం రైఫిల్స్ కాన్వాయ్పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడగా, వారిని ఇంఫాల్లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రికి తరలించారు.
ఈ కాల్పుల్లో నాయబ్ సుబేదార్ శ్యామ్ గురుంగ్, రైఫిల్మన్ రంజిత్ సింగ్ కాశ్యప్ అనే జవాన్లు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ దాడి నేషనల్ హైవే-2పై, ఇంఫాల్ నుండి బిష్ణుపూర్ వైపు వెళ్తున్న సమయంలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది. ఇంఫాల్ విమానాశ్రయం నుండి కేవలం 8 కి.మీ దూరంలో ఈ దాడి జరగడం భద్రతా వ్యవస్థలపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఘటనపై ఎవరూ ఇప్పటివరకు బాధ్యత వహించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం, భద్రతా దళాలు దీనిని తీవ్రంగా ఖండించి, దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.