నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 22 నుండి అమల్లోకి రానున్న జీఎస్టీ పన్ను తగ్గింపు ప్రకారం విజయ, సంగం సహకార డెయిరీ తమ పాల ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తూ ప్రకటించడం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఇదే రకంగా అన్ని నిత్యావసర సరుకులు ధరలు, మందుల ధరలు, విద్యా సంబంధమైన వస్తువుల ధరలు ప్రస్తుతం మార్కెట్లో ఎంత రేటు ఉన్నది జీఎస్టీ తగ్గింపు తర్వాత ఎంత తగ్గనున్నది నిర్దిష్టంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం కోరింది.
ఉదా: సంగం, విజయ డెయిరీ టెట్రా ప్యాక్ పాలు లీటరుకు ఐదు రూపాయలు తగ్గించగా, హెరిటేజ్ పాలు మూడు రూపాయలు మాత్రమే తగ్గించటం హేతుబద్ధంగా కనిపించడం లేదు. ఈ రోజు కొన్ని దినపత్రికలలో రిలయన్స్ సహా కొన్ని కంపెనీలు ధరల తగ్గింపును ప్రకటించాయి. కానీ తగ్గింపును ఎంఆర్పిపై చూపించాయి. పండుగ సందర్భంగా ఇచ్చే డిస్కౌంట్లను పన్ను తగ్గింపుగా ప్రచారం చేసి లాభాలు పొందాలని కార్పొరేట్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ మోసాన్ని అరికట్టాలి. కాబట్టి అన్ని కంపెనీలు తగ్గిన జీఎస్టీని పూర్తిగా ప్రజలకు చేరవేయాలని, రేట్లు తగ్గించని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్లో ఏ వస్తువుపై ఎంత శాతం జీఎస్టీ తగ్గుతుందో చెప్పారే.. తప్ప ఏ సరుకు ధర ఎంత తగ్గుతుందో, ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న ధర ఈ నెల 22 తర్వాత తగ్గే ధర చెప్పలేదు. అలా చెప్పకపోతే పెద్దగా ఉపయోగం ఉండదు. ఎమ్మార్పీ రేట్ల పై తగ్గించినందువల్ల ప్రజలకు ఉపయోగం జరగదు.
ఉదా: ఒక మెడిసిన్ ధర ఎంఆర్పి 100 రూపాయలు ఉంటే దానిపై 20 శాతం డిస్కౌంట్తో 80 రూపాయలకు అమ్ముతారు. జీఎస్టీ గతంలో 12 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏడు రూపాయలు తగ్గుతుంది. ఆ ప్రకారం ప్రస్తుతం అదే మందు ధర 73 రూపాయిలు ఉండాలి. కానీ 100 మీద రూ.7 తగ్గిస్తే 93 రూపాయలకు ఆమ్మితే ధరలు పెరుగుతాయి. ప్రతి సరుకుపై ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగానే జిఎస్టి రేటు ఎంత తగ్గేది ప్రకటించాలనీ సిపిఎం డిమాండ్ చేస్తుంది.
భూములు పొంది పరిశ్రమలు స్థాపించకుండా ఉన్న కంపెనీల పేర్లు ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం నుండి భూములు పొంది పరిశ్రమలు పెట్టని యజమానులకు నోటీసులు ఇస్తామని నిన్న శాసనసభలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రకటించడం హర్షణీయం. అయితే ఏ కంపెనీలకు నోటీసులు ఇస్తుందో నిర్ధిష్టంగా పేర్లు చెప్పలేదు. రాష్ట్రంలో అతి తక్కువ ప్రాంతాలలోనే గత పది సంవత్సరాలలో భూములు తీసుకున్న వారు పరిశ్రమలు పెట్టారు. అత్యధిక చోట్ల ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. దేశంలోనే అత్యంత సంపదపరుడ్కెన ఆదానీ సైతం విశాఖపట్నంలో 274 ఎకరాలు భూములు డేటా సెంటర్ కోసం తీసుకున్నప్పటికి ఇంతవరకు నిర్మాణమే ప్రారంభం కాలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిమ్జ్ సేకరించిన భూములు ప్రకాశం జిల్లాలో నిరుపయోగంగా ఉన్నాయి. ఇలా అనేకచోట్ల కృష్ణపట్నం, వాడరేవు, కాకినాడ ఎస్ఇజెడ్, లేపాక్షి నాలెడ్జి సెంటర్ సహా అనేక ప్రాంతాలలో సంవత్సరాల తరబడి ఖాళీగా ఉండి అటు వ్యవసాయ ఉత్పత్తి జరక్క, పరిశ్రమలు స్థాపించకా, ఉపాధి లేక నిరుపయోగంగా ఉన్నాయి. చివరికి ఆ భూములనే బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దివాళా ఎత్తినట్లు ప్రకటించి, బ్యాంకులను నష్టపరుస్తున్నటువంటి కంపెనీలపై చర్య తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. కాబట్టి నిర్ధిష్టంగా రాష్ట్రంలో ఎంతెంత భూములు ఎవరెవరు తీసుకున్నారు? ఎక్కడ పరిశ్రమలు ప్రారంభించారు? ఎవరు ప్రారంభించలేదు పేర్లతో సహా ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.