నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రధాని మోడీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆదివారం సాయంత్రం ప్రధాని జాతినుద్దేశించే చేసే ప్రసంగంలో ట్రంప్ పదేపదే వెల్లడిస్తున్న ‘భారత్-పాకిస్తాన్ యుద్ధ విరమణ’ వాదనను, లక్షలాది మంది భారతీయ హెచ్1బి-వీసాదారుల ఆందోళనలపై సమాధానమిస్తారా లేదా కొత్త జిఎస్టి రేట్లపై ఇప్పటికే తెలిసిన విషయాలను పునరావృతం చేస్తారా అని నిలదీసింది. ప్రధాని దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి సిద్ధమవుతున్న సమయంలో.. వాషింగ్టన్ డిసిలోని ఆయన స్నేహితుడు.. అమెరికాతో పెరిగిన వాణిజ్యాన్ని ఉపయోగించి ఆపరేషన్ సింధూర్ను ఆపివేసినట్లు 42వ సారి ప్రకటించారని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేష్ పేర్కొన్నారు.
ఈ వాదనలను ట్రంప్ అమెరికాలోనే కాకుండా, సౌదీ అరేబియా, ఖతార్ మరియు యుకెలో కూడా చేశారని అన్నారు. ”ప్రధాని ఈ వాదనలను పరిష్కరిస్తారా? పెరుగుతున్న చిక్కుముడులైన ఇండో -అమెరికా సంబందాల గురించి మాట్లాడతారా? లక్షలాది మంది భారతీయ హెచ్1బి వీసాదారుల ఆందోళనలను పరిష్కరిస్తారా? తన స్నేహితుడి టారిఫ్ల కారణంగా జీవనోపాధిని కోల్పోయే కోట్లాది మంది రైతులు, కార్మికులకు ఆయన కొన్ని హామీలు ఇస్తారా? రేపటి నుండి అమల్లోకి రానున్న కొత్త జిఎస్టి రేట్లపై మనకందరికీ తెలిసిన వాటిని పునరావృతం చేస్తారా ? ” అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఆదివారం సాయంత్రం 5.00గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఏ అంశంపై ప్రసంగిస్తారన్న దానిపై ఎటువంటి సూచన ఇవ్వలేదు.