నవతెలంగాణ ఢిల్లీ: ‘‘బకాయిల మొత్తాన్ని వసూలు చేయడానికి కోర్టులేమీ రికవరీ ఏజెంట్లు కావు. న్యాయవ్యవస్థ దుర్వినియోగాన్ని అనుమతించబోం’’ సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా మార్చే ధోరణిపై అసహనం వ్యక్తంచేసింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ కేసును విచారిస్తూ ఈవిధంగా స్పందించింది. డబ్బు రికవరీ వంటి సివిల్ వివాదంలో అరెస్ట్ను ఒక సాధానంగా ఉపయోగించకూడదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఆ వివాదంలో కిడ్నాప్ అభియోగాలు మోపడంపై ఆందోళన వ్యక్తంచేసింది. క్రిమినల్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోన్న ట్రెండ్ను ఇది ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించింది. జస్టిస్ డెలివరీ సిస్టమ్కు ఈ కేసు తీవ్ర ముప్పు అని పేర్కొంది.
అరెస్టులు చేసే ముందు తమవద్దకు వచ్చిన కేసు క్రిమినలా..? సివిలా..? అని సరిగా పరిశీలించాలని పోలీసులను హెచ్చరించింది. ఇలాంటి కేసులు పోలీసుల్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తాయని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ అంగీకరించారు. కొన్ని సందర్భాల్లో అలాంటి గందరగోళం ఉంటుందన్న సుప్రీం ధర్మాసనం.. సివిల్ వివాదాల్లో వేధింపుల సాధనంగా క్రిమినల్ చట్టాలను ఉపయోగించకుండా నిరోధించేందుకు తెలివిగా వ్యవహరించాలని సూచించింది.