Saturday, May 10, 2025
Homeజాతీయంరాష్ట్రాలపై జాతీయ విద్యావిధానాన్ని బలవంతంగా రుద్దలేం : సుప్రీం

రాష్ట్రాలపై జాతీయ విద్యావిధానాన్ని బలవంతంగా రుద్దలేం : సుప్రీం

- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడుల్లో కచ్చితంగా జాతీయ విద్యా విధానం అమలుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విద్యావిధానాన్ని అమలు చేయాలని ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయలేమని జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉంటే మాత్రం ఆ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవచ్చని తెలిపింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళ రాజ్యాంగపరంగా విద్యావిధానాన్ని అమలుచేయాలని పేర్కొంటూ ఓ న్యాయవాది సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా విద్యలో ఏకరూపకతను నెలకొల్పడానికి కేంద్రం ఎన్‌ఈపీ విధానాన్ని అమలుచేయాలని యోచిస్తోందని.. కానీ పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అనవసరంగా రాజకీయ సమస్యగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఉచిత విద్య ఒక ప్రాథమిక హక్కని..కేంద్రం రూపొందించిన ఆ విధానం అమలును నిరాకరించ డం ద్వారా.. రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల పిల్లలకు ఆ హక్కును దూరం చేస్తున్నాయని పేర్కొన్నారు. కాబట్టి పిల్లలు ప్రభావవంతమైన విద్యను పొందేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసుతో తనకేం సంబంధం ఉందని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్‌ను ప్రశ్నించగా.. తాను తమిళనాడుకు చెందిన వ్యక్తినని.. ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడ్డానని తెలిపారు. దేశ రాజధానిలో స్థిరపడినప్పుడు వివిధ రాష్ట్రాల్లో జాతీయ విద్యావిధానం అమలు గురించి పిటిషన్‌ దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ.. అత్యున్నత న్యాయ స్థానం పిటిషన్‌ను కొట్టేసింది. తన పిల్లలు ఢిల్లీలో హిందీ నేర్చుకోవడం కొనసాగిం చవచ్చని పిటిషనర్‌కు తెలిపింది. జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీష్‌, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే ప్రభుత్వం స్పష్టంచేస్తోంది. ‘ఎన్‌ఈపీ’ విషయంలో తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. రాజకీయ అభిప్రాయ భేదాలకు అతీతంగా దీన్ని అమలుచేయాలని స్టాలిన్‌కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల ఓ లేఖలో సూచించారు. అయితే.. తమిళ భాషకు, ప్రజలకు, రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలను అనుమతించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి పలుమార్లు స్పష్టం చేశారు. మరోవైపు.. జాతీయ విద్యావిధానాన్ని ఆమోదిస్తేనే తమిళనాడుకు నిధులు విడుదలవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -