నవతెలంగాణ-హైదరాబాద్: సినిమా పరిశ్రమ నుండి ఇకపై ఎవరూ కూడా బెట్టింగ్ యాప్లను ప్రచారం చేయరని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా పరిశ్రమకు, ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పైరసీ రాయుళ్ల విషయమై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా వేదికగా పలు అంశాలు పంచుకున్నారు. పైరసీ, బెట్టింగ్ యాప్ల ప్రచారంపై సినీ పరిశ్రమ నిరంతరం పోరాటం చేస్తోందని, ఈ పోరాటంలో హైదరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇందుకు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. పైరసీ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారనే కారణంతో పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నటీనటులు విజయ దేవరకొండ, మంచు లక్ష్మీ, రాణా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ తదితరలు ఈడీ ముందు విచారణకు హాజరైయ్యారు. అంతేకాకుండా ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, రాబిన్ ఊతప్ప, శిఖర్ ధావన్ పేర్లు జాబితాలో ఉన్నాయి. నటుడు సోను సూద్, తృణమూల్ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా కూడా ఈడీ రాడార్లో ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా విచారణకు పిలిచారు.