నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ కీలక ప్రకటన చేశారు. తాను దేశం వీడి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు.
తాను ఎవరికీ భయపడనని.. దేశంలోనే ఉండి తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని ఓలీ అన్నారు. దేశంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ పాలనను తిరిగి పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నానన్నారు. సుశీలా కార్కి నేతృత్వంలోని పరిపాలనకు ఎటువంటి చట్టబద్ధత లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల తీర్పుతో కాకుండా.. విధ్వంసం శక్తుల ద్వారా అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు.
కాగా, నేపాల్ మాజీ ప్రధాన మంత్రి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (UML) ఛైర్మన్ కేపీ శర్మ ఓలి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్నారు. పార్టీ విద్యార్థి విభాగం, రాష్ట్రీయ యువ సంఘ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన శనివారం భక్తపూర్ చేరుకున్నారు.
ఇటీవల నేపాల్లో జరిగిన జెన్-జెడ్ ఆందోళనల ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా జెన్-జీ(Gen Z) ఎంపిక చేశారు. కార్కీ సిఫార్సు మేరకు దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ పార్లమెంటును రద్దు చేశారు. 2026 మార్చి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.