నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ బీహార్ తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముగియడంతో ఓటరు జాబితా ఫైనల్ లిస్ట్ను ఈసీ ఆన్లైన్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది.బిహార్ తుది ఓటరు జాబితా మంగళవారం విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో, వచ్చే వారంలో ఈసీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు.
ఆగస్ట్ ఒకటో తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో 7.24 కోట్ల ఓటర్లున్నారు. ఇలా ఉండగా, ఈసీ బృందం అక్టోబర్ 4, 5వ తేదీల్లో పట్నాకు వెళ్లి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరపనుంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశముందని సమాచారం.
మొదటి దశ పోలింగ్ ఛట్ పండుగ తర్వాత అక్టోబర్ ఆఖర్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ఎన్నికల పరిశీలకుల నియామకం కసరత్తు అక్టోబర్ 3వ తేదీకల్లా ముగియనుందని చెబుతున్నారు. బిహార్ అసెంబ్లీ ప్రస్తుత గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. గత అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి.