నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 100% సుంకాన్ని ప్రకటించారు. నవంబర్ 1, 2025 నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో మరోసారి బలమైన రెండు ఆర్థిక దేశాల మధ్య మరోసారి ట్రేడ్ వార్ మొదలైంది. గతంలో కూడా రెండు దేశాలు పరస్పరం సుంకాలు పెంచుకొని ఢీ అంటే ఢీ అన్నాయి. ఆ తర్వాత పలు దఫాలుగా చర్చలు కొనసాగించి సమస్యను పరిష్కారం చేసుకున్నాయి. ట్రంప్ తాజా నిర్ణయంతో చైనా-అమెరికాల మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్తతలు తలెత్తాయి.
అయితే.. యూఎస్ నిర్ణయంపై బీజింగ్ ప్రభుత్వం స్పందించింది. ట్రంప్ సుంకాలను ఏకపక్షంగా అభివర్ణిస్తూ, ప్రతీకార చర్యలకు బలమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా చర్యలు చైనా ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని, ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అమెరికా నిర్ణయంపై మంత్రిత్వ శాఖ నిర్మొహమాటంగా స్పందిస్తూ.. “సుంకాల విషయంలో ట్రంప్ సర్కార్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు మా దేశ ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయి. సాధారణంగా మేము ఎవరితో ఘర్షణలకు దిగము. అలాగని అవసరం వస్తే పోరాడటానికి సైతం వెనకడుగు వేయము. చర్యకు ప్రత్ని చర్య ఉంటుంది. ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయి.” అని ఓ చైనా పేర్కొంది.