నవతెలంగాణ -హైదరాబాద్: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో నిన్న దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిని అమానుషంగా హింసించి హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనకర వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే… గ్రామస్తులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, నోముల గ్రామానికి చెందిన నర్సింగ్ జానయ్య (34) అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపై గతంలో జానయ్యపై పోలీసు కేసు కూడా నమోదైందని సమాచారం. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సదరు దంపతులు నిన్న జానయ్యను అడ్డగించి, ఓ చెట్టుకు కట్టేశారు. అనంతరం కళ్లల్లో కారం చల్లి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. రక్తం కారుతూ, స్పృహ కోల్పోయేవరకు జానయ్యను చితకబాదారని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న జానయ్య బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని, చెట్టుకు కట్టేసి ఉన్న అతడిని విడిపించారు.
వెంటనే 108 అంబులెన్సులో నకిరేకల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు, జానయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నల్గొండ జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే, నల్గొండకు తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే జానయ్య మృతి చెందాడు. ఈ వార్త తెలియగానే మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ హత్య వెనుక కేవలం వివాహేతర సంబంధమే కాకుండా, ఆస్తులు, డబ్బుల కోసం పక్కా ప్రణాళిక ప్రకారమే జానయ్యను హత్య చేశారని ఆయన బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ దిశగా కూడా విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జానయ్య తల్లి నర్సింగ్ ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు నకిరేకల్ పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపారు. అన్ని కోణాల్లోనూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ హత్యోదంతంతో నోముల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.