నవతెలంగాణ – హైదరాబాద్; తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఈ హత్య కేసులో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావును ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే దర్యాప్తులో భాగంగా తేజేశ్వర్ హత్య తర్వాత.. తిరుమలరావు.. తన భార్యను కూడా చంపాలని ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. ఐశ్వర్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న తిరుమలరావు.. అతడికి అంతకుముందే పెళ్లి అయి 8 ఏళ్లు అయినా సంతానం కలగకపోవడంతో ఐశ్వర్యతో పిల్లలు కనాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు అడ్డుగా ఉన్న తేజేశ్వర్తోపాటు.. తన భార్యను కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఈ క్రమంలోనే తేజేశ్వర్ను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో సంబంధం కొనసాగించిన ఐశ్వర్య.. తేజేశ్వర్ను పెళ్లి చేసుకుని.. నెలరోజుల్లోపే తన భర్తను హత్య చేయించింది. అయితే అప్పటికే తిరుమలరావు కు పెళ్లి అయి 8 ఏళ్లు అయినా పిల్లలు కలగలేదు. ఈ క్రమంలోనే తిరుమలరావు పనిచేసే బ్యాంకులో ఐశ్వర్య తల్లి స్వీపర్గా పనిచేయగా.. మొదట వీరిద్దరికీ వివాహేతర సంబంధం కుదిరింది. ఆ తర్వాత తల్లితోపాటు ఆమె కుమార్తె ఐశ్వర్యతోనూ తిరుమలరావు సంబంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్యతో పిల్లలను కనాలని భావించాడు. ఐశ్వర్య కోసం చివరికి తన భార్యను చంపాలని కూడా తిరుమలరావు భావించినట్లు తాజాగా వెల్లడైంది.
ఈ క్రమంలోనే జూన్ 17వ తేదీన.. నగేష్, పరుశురాం, రాజు అనే ముగ్గురు వ్యక్తులు కలిసి తమ ల్యాండ్ సర్వే చేయాలని చెప్పి.. తేజేశ్వర్ను కారులో తీసుకెళ్లారు. అంతకుముందు రోజే బ్యాంకు నుంచి రూ.20 లక్షలు విత్ డ్రా చేసిన తిరుమలరావు.. తేజేశ్వర్ను హత్య చేసినందుకు ఆ సుపారీ గ్యాంగ్కు రూ.2 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత తేజేశ్వర్ను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని కర్నూలు శివారులో పడేసి తిరుమలరావుకు సుపారీ గ్యాంగ్ చూపించారు.
అయితే ఈ హత్య తర్వాత ఐశ్వర్యతో కలిసి లఢఖ్ వెళ్లేందుకు తిరుమలరావు పక్కా పథకం వేశారు. ఇందుకు ఐశ్వర్య తన తల్లికి ఫోన్ చేసి కొన్ని బట్టలు కూడా తెప్పించుకోవడం గమనార్హం. ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరింత లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు తిరుమలరావును పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు. తిరుమలరావు లఢఖ్కు వెళ్లినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.