నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం) పూర్వ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్థంతి సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగింది. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అధ్యక్షత సభలో ముఖ్యఅతిథిగా హాజరైన రాఘవులు తొలుత ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన “భారతీయ భావన- వాస్తవం- వక్రీకరణ” అనే అంశంపై మాట్లాడుతూ ప్రజాస్వామ్యంతో పాటు విదేశాంగ విధానం, లౌకికవాదం, ఫెడరలిజం కూడా ప్రమాదాన్ని ఎదుర్కుంటున్నాయన్నారు.
ఈ సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, టీ.సాగర్, పాలడుగు భాస్కర్, మల్లు లక్ష్మి, పి.ప్రభాకర్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.