– అనాథలుగా మారిన కూతుళ్లు
– సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో ఘటన
నవతెలంగాణ-మర్కుక్
తనకున్న ఎకరం పొలం త్రిబుల్ ఆర్లో పోతున్నదనే ఆవేదనతో ఓ వికలాంగుడు గుండెపోటుకు గురై మృతి చెందిన విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామంలో మంగళవారం జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సన్నపేట గ్రామానికి చెందిన వికలాంగుడు యెంబరి బిక్షపతి(42) గ్రామ పరిధిలో తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే నాలుగు రోజుల కిందట త్రిబుల్ ఆర్కు సంబంధించి అధికారులు భూసేకరణ నోటీసును బిక్షపతికి అందించారు. దాంతో ఉన్న ఎకరా పొలం పోతున్నదని మనోవేనదకు గురయ్యారు. బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి రూ.కోటి పలుకుతుంటే.. ప్రభుత్వం పరిహారంగా కేవలం రూ.8 లక్షలు మాత్రమే ఇస్తామని నోటీసులో ఇచ్చింది. దాంతో రెండ్రోజులుగా తీవ్ర మనోవేదనతో బాధపడుతూ సోమవారం అర్థరాత్రి గుండె పోటుతో మృతి చెందాడు. మృతుని భార్య అనసూయ మూడేండ్ల కిందట ఆత్మహత్య చేసుకోవడంతో.. ఇద్దరు పిల్లల్ని బిక్షపతి పోషిస్తున్నాడు. ప్రస్తుతం బిక్షపతి మృతితో కూతుర్లు ఇద్దరూ నిత్య (10), రితిక (8) అనాథలయ్యారు.
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన
గుండెపోటుతో బిక్షపతి మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు.. అనాథలైన పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలసి గణేష్పల్లి చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఇది ప్రభుత్వ హత్యేనని అరోపించారు. మృతునికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మృతుని పిల్లల చదువులకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ ఎస్ఐ దామోదర్, తహసీల్దారు ప్రవీణ్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని.. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తెసుకెళ్తామని హమీనిచ్చారు. దాంతో గ్రామస్తులు ధర్నాను విరమించారు.
ఆర్ఆర్ఆర్లో భూమి పోతున్నదనే ఆవేదనలో..గుండెపోటుతో వికలాంగుని మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES