‘నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఎంతో నర్వెస్గా ఉన్నాను. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. మా ‘శుభం’ సినిమా చాలా బాగా వచ్చింది’ అని నటి, నిర్మాత సమంత అన్నారు. ఆమె నిర్మాతగా మారుతూ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో సమంత ముచ్చటించారు. ఆ విశేషాలు..
ఈ చిత్రంలో ఎక్కువగా సీరియల్ గురించి ఉంటుంది. ఆ సీరియల్లో శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందా? అని అంతా ఎదురుచూస్తుంటారు. అందుకే ‘శుభం’ అని టైటిల్ పెట్టాం. ఈ చిత్రానికి వసంత్ కథను అందించారు. ఈ మూవీ చూసిన తరువాత ప్రతీ ఒక్క ఆడియెన్ మీద ప్రభావం చూపించాలని కోరుకున్నాను. దాదాపు మహిళలందరికీ సీరియల్స్ అంటే పిచ్చి ఉంటుంది. ఇది జనరల్ హర్రర్, కామెడీ అనేలా మాత్రం ఉండదు. సోషల్ సెటైర్ ఉంటుంది కానీ.. మెసెజ్ ఉంటుందా? లేదా? అన్నది మీరే తెలుసుకోండి (నవ్వుతూ). ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు వీలుంటుంది.
గౌతమ్ మీనన్ నాకు మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆయన తల్చుకుంటే ఆ టైంలో ఏ టాప్ హీరోయిన్ అయినా నటించేవారు. కానీ ఆయన నాలాంటి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. నేను కూడా నిర్మాతగా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతోనే ఉన్నాను. పరిశ్రమలోకి ఎన్నో కలలతో వస్తుంటారు. ఈ సినిమాలో శ్రియా, శ్రావణి, షాలినీలు ఎంతో కష్టపడ్డారు. నా సినిమాలో నటించిన వారందరినీ చూస్తే నా పాత రోజులన్నీ గుర్తుకు వచ్చాయి.
ఈ చిత్రంలోని అతిథి పాత్రని నేను చేయాల్సింది కాదు. కానీ నిర్మాతగా మొదటి సారిగా నేను ఎవరి దగ్గరకు వెళ్లి ఫేవర్ అడగాలని అనుకోలేదు. అందుకే ఆ పాత్రను నేనే పోషించాను. ప్రస్తుతం నేను ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని చేస్తున్నాను.
కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం..
- Advertisement -
- Advertisement -