నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో మరో బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్సుకు (Delta Airlines) చెందిన బోయింగ్ 767-400 (Boeing 767) విమానంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గుర్తించిన పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన DL446 బోయింగ్ 767 విమానం లాస్ ఏంజిల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్నది. ఈ క్రమంలో లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX) నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఎడమవైపు ఉన్న ఓ ఇంజిన్లో మంటలు అంటుకున్నాయి. గుర్తించిన పైలట్ ఏటీసీకి సమాచారం అందించారు. వారు అనుమతించడంతో లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, ఇద్దరు పైలట్లు కలిపి మొత్తం 294 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ విమానం క్షేమంగా ల్యాండ్ అవడం, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.