నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో గురువారం టీచర్స్ ఆర్గనైజేషన్స్ యొక్క ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ (AIJACTO) భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. జంతరమంతర్ వద్దకు భారీ యోత్తున్న చేరుకున్న దేశంలోని వివిధ రాష్ట్రాల ఉపాధ్యాయులు ముక్తకంఠంతో తమ డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాడుతామని దీమా వ్యక్తం చేశారు.చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం.. తొలిసారిగా పాఠశాల విద్యాశాఖలోని పలు జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘాలు ఒకే వేదికపై ఏకమై సమిష్టి పోరాటాన్ని ప్రారంభించాయి.
ఈ సందర్భంగా టీచర్ల యూనియన్ సంఘాలు ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశాయి. వర్కింగ్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనీసరీ చేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణయాన్ని సమీక్షించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, కొత్తగా రూపొందించిన యూపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రజావ్యతిరేక నిర్ణయాలను తొలగించాలన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నారనే సాకుతో స్కూల్స్ విలీనాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు. ప్రాధమిక స్థాయి టీచర్లకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలన్నారు. వేతన ఉద్యోగులపై ఆదాయపు పన్ను భారం తగ్గింపు, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించడం, వారికి కనీస వేతనాలు అమలు చేయాలని తదితర అంశాలతో తీర్మానం చేశారు.
ఆల్ ఇండియా టీచర్లు చేపట్టిన నిరసనకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. సీపీఐ(ఎం) ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వీ శివదాసన్, ఫ్లోర్ లీడర్ సెల్వరాజ్(సీపీఐ), కుమార్ నాయక్(కాంగ్రెస్), రాజా రామ్ సింగ్(సీపీఐ(ఎంఎల్)లు తమ మద్దతు తెలిపారు. అదే విధంగా వారి సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతామని హామీ ఇచ్చారు.సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గోపీమూర్తి, తెలంగాణకు చెందిన శ్రీపాల్రెడ్డి ఉన్నారు.



