Wednesday, June 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబనకచర్లపై తాడోపేడో

బనకచర్లపై తాడోపేడో

- Advertisement -

– ఏపీపై తెలంగాణ గుర్రు
– అక్రమ ప్రాజెక్టుపై సమరం
– నేడు ఎంపీలతో భేటీ
– సీఎంతోపాటు కేంద్రమంత్రుల రాక
– నీటిపారుదల శాఖ కార్యాచరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసిన సర్కారు, ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసింది. సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. అయినా బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కారు రూ.82 వేల కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను తయారు చేసింది. కేంద్ర జలశక్తి శాఖతోపాటు సీడబ్ల్యూసీకి పంపినట్టు సమాచారం. అయితే బనకచర్ల డీపీఆర్‌ తమకు అందలేదని సీడబ్ల్యూసీ చెబుతున్నది. సీడబ్ల్యూసీ, తెలంగాణ నీటిపారుదల శాఖల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. ట్రిబ్యునల్‌, చట్టాలకు విరుద్ధంగా ఏపీ సర్కారు చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా అభ్యంతరాలను చెప్పారు. సీఎం రేవంత్‌ ఉత్తరాలు రాశారు. జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను సైతం కలిశారు. ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలంగాణ సర్కారు అంచనా. ప్రస్తుతం కేంద్ర జల సంఘం వద్ద ఉన్న గోదావరి-బనకచర్ల ప్రీఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అ అంశాల ఆధారంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యాచరణకు దిగింది. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. దీనికి సీఎం రేవంత్‌తోపాటు కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, బండి సంజరుని సైతం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు. బనకచర్ల డీపీఆర్‌కు కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకునేందుకు ఎంపీలకు ప్రత్యేకంగా పీపీటీ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ను ఈనెల 3న కలిసిన సంగతి తెలిసిందే. ఇందుకు సదరు కేంద్ర మంత్రి స్పందిస్తూ డీపీఆర్‌ ఇంకా అందలేదనీ, అది వచ్చాక నీటి కేటాయింపుల్లో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు, ట్రిబ్యునల్‌ తీర్పులు, అంతర్‌ రాష్ట్ర ఒప్పందాలతోపాటు 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాలను పరిగణనలోకి తీసుకున్నాకే సమీక్షిస్తామని సర్కారు అంటున్నది. కాగా బనకచర్ల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే అసహనం వ్యక్తం చేశారు. మిగులు జలాలను వాడుకుంటే తెలంగాణ వారికి అభ్యంతరం ఎందుకంటూ మీడియాతో వ్యాఖ్యలు చేశారు. బనకచర్లకు కేంద్రం సానుకూలంగా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పార్లమెంటు ఎంపీలతో పీపీటీని ఏర్పాటు చేసినట్టు మంత్రి ఉత్తమ్‌ తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -