– ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం
– ఏకపక్షంగా తోసిపుచ్చిన అమెరికా
న్యూయార్క్: గాజాలో బేషరతుగా, శాశ్వతంగా తక్షణమే కాల్పుల విరమణ జరపాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా బుధవారం ఏకపక్షంగా తోసిపుచ్చింది. ఇందుకు తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. తద్వారా మానవతా సంక్షోభాన్ని పరిష్కరించాలన్న విజ్ఞప్తులను పెడచెవిన పెట్టింది. భద్రతా మండలిలోని పది తాత్కాలిక సభ్య దేశాలు ఈ తీర్మానాన్ని రూపొందించాయి. హమాస్అదుపులో వున్న బందీలను వెంటనే విడుదల చేయాలని కూడా ఆ తీర్మానం డిమాండ్ చేసింది. మానవతా సాయంపై విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని, గాజాలో అత్యవసరసేవలను అందించాలని తీర్మానం కోరింది. ఇజ్రాయిల్ను నేరుగా, కఠినంగా విమర్శించడాన్ని కుదిస్తూ, పరుషమైన పదజాలం కాకుండా సున్నితమైన భాషనే ఉపయోగించి తీర్మానాన్ని రూపొందించినప్పటికీ అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేసింది. పైగా ఖతార్, ఈజిప్ట్, అమెరికా నేతృత్వంలో జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు కూడా మద్దతిచ్చింది. అయినా అమెరికా ఆ తీర్మానాన్ని వ్యతిరేకించింది.
హమాస్ను ఖండించడంలో విఫలమైన ఏచర్యకూ అమెరికా మద్దతివ్వబోదని ఐరాసలో అమెరికా రాయబారి డొరొతి షా స్పష్టం చేశారు. హమాస్ ఆయుధాలను అప్పగించి, గాజా నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయిల్ను విమర్శించే తీర్మానాలను అమెరికా ఇలా వీటో చేయడం ఇది ఆరవసారి.
ఇజ్రాయిల్కు సాంప్రదాయ మిత్రదేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలు కూడా అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని తమ వైఖరిని మార్చుకుని కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తున్నాయి. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా, గాజా ఆహార పంపిణీ కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
హింసను అంతమొందించాలని, గాజాలో ప్రజల ఇబ్బందులను నివారించాలని అంతర్జాతీయంగా వస్తున్న విజ్ఞప్తులను తోసిరాజని అమెరికా, ఇజ్రాయిల్కు నిరంతరంగా మద్దతును, దౌత్యపరమైన తోడ్పాటును అందిస్తూనే వస్తోంది. ఈ తరుణంగా పాలస్తీనియన్లకు బాసటగా నిలిచి, వారికి సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా వుందని మానవ హక్కుల కార్యకర్తలు పేర్కొంటున్నారు.
గాజాలో శాశ్వతంగా కాల్పులు విరమించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES