నవతెలంగాణ – హైదరాబాద్: నటసింహం నందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఒక అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో కథానాయకుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, బ్రిటన్ కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ఆయనకు ‘గోల్డ్ ఎడిషన్ రికగ్నిషన్’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మైలురాయిని చేరుకుని, ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయ నటుడిగా బాలకృష్ణ చరిత్ర సృష్టించారు.
యాభై ఏళ్ల పాటు హీరోగా కొనసాగడం అనేది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అరుదైన విషయం. ఈ విశేషమైన ఘనతను గుర్తించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ, బాలకృష్ణ సినీ ప్రయాణాన్ని ప్రశంసిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్లో ఒక భారీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలో బాలకృష్ణకు అధికారికంగా పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ వార్త తెలియగానే ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
