– ప్రధానికి సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి బేబీ లేఖ
న్యూఢిల్లీ: కాల్పుల విరమణకు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు, ఆందోళనలను పరిష్కరించేదుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం ఈ క్రింది విధంగా వుంది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి, కాల్పుల విరమణ ప్రకటించడానికి సంబంధించి చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నాను. ఈ ప్రకటన మన దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అలాగే అంతర్జాతీయ శాంతి కాముకులకు ఉపశమనం కలిగించింది. అయితే, ఇంకా అనేక ఆందోళనలు-ముఖ్యంగా, పహల్గాంలో ఉగ్ర దాడికి సంబంధించినవి అపరిష్కృతంగానే వున్నాయి.
ఏప్రిల్ 22న అమాయకులైన పర్యాటకులపై జరిగిన హేయమైన దాడి మన దేశ ప్రజల మనస్సులను కదిలించివేసింది. అయినా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రదర్శించిన సమైక్యతా భావం అత్యంత శక్తివంతమైన, అమూల్యమైన శక్తిగా నిలిచింది. ఈ సంఘీభావాన్ని ఉపయోగించుకుని దేశీయ, విదేశీ ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను ఏకాకులను చేయాలి.
అయితే, ఈ జాతీయ ఐక్యతా భావనను విద్వేషం, దేశభక్తి యొక్క తీవ్రమైన ప్రచారాలు దెబ్బతీయడం విచారకరం. అలాగే కొన్ని మీడియా సంస్థలు, శక్తులు సామాజిక మాధ్యమాల వేదికలపై పాల్పడే తప్పుడు సమాచార వ్యాప్తి కూడా ఆందోళనకరం. ఇటువంటి చర్యలు ప్రజల్లోల తీవ్రమైన గందరగోళాన్ని, అశాంతిని కలిగిస్తాయి.
దీనికితోడు, భారత్, పాక్ల మధ్య కాల్పుల విరమణకు సంబంధించి ఆయా దేశాల ప్రతినిధుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తోంది. తృతీయ పక్షం జోక్యాన్ని అనుమతించకుండా మన వివాదాలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలన్నది మన దేశం ఆమోదించిన స్పష్టమైన విధానంగా వుంది. అందువల్ల, ఈ పరిస్థితికి మన ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పష్టమైన, అధికారయుతమైన వివరణ రావాల్సిన అవసరం వుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సీపీఐ(ఎం) సభా నాయకులు ఇప్పటికే అభ్యర్ధించినట్లుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ప్రభుత్వ వైఖరిని వివరించడంలో ప్రధానిగా మీరు కూడా ఈ సమావేశాలకు హాజరు కావాలని కోరుతున్నాం.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -