సంగీతమనే మూడక్షరాల్లో ఉన్న శక్తి మాటల్లో చెప్పలేము. పాట అనగానే ముందుగా మనకు కోయిలమ్మే గుర్తుకు వస్తుంది. మనకు నచ్చిన పాటో, మనసుకు హత్తుకునే సంగీతమో విన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక రకమైన తన్మయత్వం కలుగుతుంది. ఒత్తిడికి లోనైనప్పుడు ఏదైనా ఒక మంచి పాట వింటే ఎంతో స్వాంతన లభించడమే కాక నూతన ఉత్తేజం కలుగుతుంది. పాటలు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మరింత సందడిగా ఆహ్లాదంగా మారుస్తాయి. సంగీతానికి పరవశించని వారంటూ ఉండరేమో! జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి సంగీతం సహాయపడుతుంది. కళారూపం ఏదైనా సరే భాషా అడ్డంకులను దాటుకొని దాన్ని మరింత అందంగా చేసేది సంగీతం. అందుకే పాట లేని ప్రపంచాన్ని ఊహించలేము. రేపు అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా ప్రముఖ గాయని శీమతి నాగేశ్వరి రూపాకుల తన సంగీత ప్రస్థానాన్ని మానవితో ఇలా పంచుకున్నారు…
మీ విద్యాభ్యాసం? స్వగ్రామం?
నేను పుట్టింది పెరిగింది చదువుకున్నది నెల్లూరిలోనే. ఏబియం గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. ప్రముఖ నేపధ్యగాయని ఎస్పీ శైలజ మా స్కూలే. నేను, తను కలసి స్కూల్లో డ్రామాలు, పాటలు, డాన్సుల్లో పాల్గొన్నాం. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ఇంటర్ కామిశెట్టి ఆదిశేషయ్య శెట్టి కాలేజీలో, బి.కామ్ డిగ్రీ వి.ఆర్.కాలేజీలో చదివాను. ఇంటర్, డిగ్రీ కాలేజీ ఫస్ట్ వచ్చాను. దానికి లయన్స్ క్లబ్ వారు సన్మానం కూడా చేసారు. తర్వాత బ్యాంకు పరీక్షలు రాశాను. సిండికేట్, ఎల్.ఐ.సి, స్టేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి స్టేట్ బ్యాంక్ చిత్తూరు జిల్లా వడమాలపేటలో చేరాను. అప్పటి నుండి నెల్లూరుకి ఏదైనా సెలవలకు వెళ్ళడమే. బదిలీల వల్ల నెల్లూరికి పూర్తిగా దూరమయ్యాను. కరెస్పాండెన్స్ కోర్స్ ద్వారా ఎమ్.కాం ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తి చేశాను. 28 ఏండ్ల పాటు వివిధ ప్రదేశాలలో ఉద్యోగం చేసాను. ఇంకా పదేండ్ల సర్వీస్ ఉన్నా 2014లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ చేసాను.
మీ సంగీత ప్రస్థానం ఎలా మొదలయింది?
చిన్నప్పుడు అక్కతో ఊరికే అక్కడ ఉన్న జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళేదాన్ని. సాయంత్రం స్కూల్ వదిలేముందు అసెంబ్లీ ఉండేది. టీచర్స్ ముద్దుగా ఉన్నానని పాడమని అడిగితే ‘బొట్టూ కాటుక పెట్టుకుని’ అని ఏదో సినిమా పాట పాడాను. ఆ తర్వాత ఇంట్లో బాగా అక్షింతలు పడ్డాయి. మా ఇంట్లో సినిమా పాటలు తక్కువ. భక్తి పాటలు, కీర్తనలు వినడం, పాడటం ఎక్కువ. ఘంటసాల భక్తి పాటలు బాగా పాడేవాళ్లం. ఎందుకంటే రేడియోలో అవే ఎక్కువ వచ్చేవి. స్కూల్, కాలేజీ పోటీలలో కూడా ఘంటసాల పాటలే పాడేదాన్ని.
సంగీతం నేర్చుకోవడం ఎప్పుడు మొదలుపెట్టారు?
మా అమ్మ సుభద్రమ్మే నా ప్రధమ గురువు. చిన్నప్పుడు నేర్చుకోవడం ఎవరికి ఇష్టముంటుంది? కానీ మా అమ్మే మొట్టికాయలు మొట్టి నేర్పింది. కరెంటు పోయినపుడు చీకట్లో సరదాగా కొన్ని రాగాలు పాడి వాటిని గుర్తించమని చెప్పేది. సంగీతం ఒక ఆటలా నేర్పింది. అమ్మ కచ్చేరీలు చేసేది, తనతో పాటు నేనూ వెళ్లేదాన్ని. అలా రాగాల గురించి అవగాహన వచ్చింది. నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రమణ్యం నాన్నగారు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారు అప్పట్లో బిక్షాటన పూర్వక త్యాగరాజ ఉత్సవాలు చేసేవారు. అందులో ప్రముఖ విద్వాంసులు పాడేవారు. మా అమ్మలాంటి లోకల్ విద్వాంసులకు కూడా పాడే అవకాశం ఉండేది. అలా అమ్మతో కలిసి పాడేదాన్ని. మా అమ్మ నా పద్దెనిమిదవ ఏట కన్నుమూసింది. తర్వాత అమ్మ దగ్గర నేర్చుకున్న సంగీత జ్ఞానంతో సర్టిఫికేట్ కోర్స్ చేసాను. నెల్లూరు మ్యూజిక్ కాలేజీలో చేరి వీణావాద్యం శ్రీ రమణారావు వద్ద నేర్చుకుని మంచి మార్కులతో పాసయ్యాను. తర్వాత రమమోహినిబాయి అనే టీచర్ దగ్గర చేరి గాత్రంలో డిప్లొమా చేసాను.
మీ కుటుంబంలో సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
చెప్పా కదా! అమ్మ సంగీతమే మా అందరికీ వచ్చింది. మా పెద్దక్క మ్యూజిక్ హయ్యర్ పాస్ అయ్యింది. నేను మా మూడో అక్క అనూరాధ కలిసి ఎక్కువ పాడేవాళ్ళం. నాకు గుర్తున్నంత వరకు తనతో కలిసి ముదివర్తి పాళెంలోని ఒక స్కూల్లో మొదటి సారి పెద్ద ప్రోగ్రాం చేశాను. ఇద్దరం కలిసి కర్ణాటక, లలిత సంగీతం పాడే వాళ్ళం. అలా కడప, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో యువవాణి కార్యక్రమాలలో పాడే అవకాశం వచ్చింది. మా అన్నయ్య వెంకట నాగరాజ్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్గా పని చేసేవారు. కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నెల్లూరులో సింహపురి సంగీత సభ అని ఒక సంస్థను, ఒంగోలులో మరొక సంస్థను నెలకొల్పి ఎన్నో సంగీత సాహిత్య కార్యక్రమాలు చేసేవాడు. అలా జరిగే కార్యక్రమాల్లో నేనూ పాల్గొనేదాన్ని. అన్నయ్య నన్నేంతే ప్రోత్సహించేవాడు. మా ఇంటి దగ్గరలో ఉండే ఒక స్కూల్లో ప్రతి రిపబ్లిక్ డే కి, ఇండిపెండెన్స్ డే కి తప్పకుండా నా దేశభక్తి గీతాల ప్రోగ్రాం ఉండేది.
ఇప్పటివరకు ఎన్ని కచ్చేరీలు ఇచ్చారు?
రెండు వేల ప్రోగ్రాములు వరకు గుర్తున్నాయి. తర్వాత గుర్తుపెట్టుకోవడం మానేసాను. అవకాశం వచ్చినప్పుడల్లా పాడుతూనే ఉంటా. దూరదర్శన్ హైదరాబాదులో జానపద సంగీతాన్ని అనేక మార్లు ఆలపించాను. సినిమా పాటలు విని నేర్చుకుని దూరదర్శన్ వారు నిర్వహించిన ‘కలసి పాడుదాం’ అనే పోటీలో మొదటి రన్నర్ అప్గా నిలిచాను. జెమిని టీవీ ‘నవరాగం’, ‘ఆలాపన’, ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘గజిబిజి గపదని’, ‘రోచీస్ అంత్యాక్షరి’ ఇలా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఈటీవీలో కూడా ఒకటి రెండు ప్రోగ్రాముల్లో పాల్గొన్నాను. ఇవన్నీ ఫిలిం బేస్డ్ ప్రోగ్రామ్స్. కర్ణాటక సంగీతంలో ప్రముఖ సంగీత వాగ్గేయకారులైన త్యాగరాజు, ముతుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రిల కీర్తనలతో పాటు అన్నమాచార్య, పురందర దాసు, నారాయణ తీర్థ వంటి సంకీర్తనాచార్యుల కీర్తనలు 500లకు పైగా అభ్యసించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్, నిజామాబాదు, కరీంనగర్లలో కచ్చేరీలు చేశాను. తిరుమలలో అనేక సార్లు పాడాను. ప్రతి ఏడాది స్టేట్ బ్యాంకు వారు నిర్వహించే జోనల్, రాష్ట్ర స్థాయి లలిత గీతాల పోటీలో వరుసగా ఆరేండ్లు ప్రధమ స్థానంలో నిలిచాను. ఇంటర్ బ్యాంకు పోటీలలోనూ పాల్గొన్నాను. బ్యాంకు నుండి 2012లో ‘ఉగాది ప్రతిభా పురస్కారం’ అందుకోవడం అరుదైన గౌరవం. విదేశాలలో కూడా పాడాను. 2013లో తిరుపతిలో జరిగిన సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రపంచ తెలుగు మహా సభల్లో శ్రీ మాస్టార్జీ గారితో 45 నిమిషాలపాటు జానపద కళా వేదికను పంచుకుని ప్రేక్షకుల ప్రశంసలు పొందగలిగాము. అలాగే ఎన్నో సంస్థల ద్వారా ఎన్నో సినీ సంగీత విభావరులలో పాడాను. ఎన్నో సన్మానాలు అందుకొన్నాను. యువకళా వాహిని ఆధ్వర్యంలో ‘శత చిత్ర గీత లహరి’ అంటే 100 సినిమా పాటలు విరామం లేకుండా ఉదయం 8.30 నుండి రాత్రి 8.30 వరకు దాదాపు 12 గంటల పాటు హైదరాబాదులోని త్యాగరాయ గాన సభలో పాడాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
సంగీత తరగతులు ఏమైనా తీసుకుంటున్నారా?
ఆన్లైన్, ఆఫ్లైన్లో కర్ణాటక సంగీతం నేర్పుతున్నాను. మంచి పాటలు, సంప్రదాయ కీర్తనలు, జోల పాటలు, మంగళ హారతులు, నేను పాడిన స్టేజి ప్రోగ్రాములలో చక్కగా వచ్చినవి నా ఛానల్ ‘నాగేశ్వరి రూపాకుల’ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 250కి పైగా పాటలు అందులో ఉన్నాయి. ముఖ్యంగా ‘ఏకరాగం- దశ సినీ గీతాలు’ అనే శీర్షికతో 26 రాగాల గురించి రాగ వివరణ, విశ్లేషణ, ఆ రాగంలో వచ్చే పది లేదా అంతకుమించిన తెలుగు సినిమా పాటలతో వీడియోలు చేశాను. దానికి విశేష ఆదరణ లభించింది. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 12,000కు పెరగడమే దీనికి నిదర్శనం. ఇదే విషయంపై రాత పూర్వకంగా ‘విశాఖ సంస్కృతి మాస పత్రిక’లో ధారావాహికగా ‘ఏకరాగం – దశ సినీ గీతాలు’ శీర్షికతో 15 నెలలుగా రాస్తున్నాను. 30 రాగాలతో ఒక పుస్తకంగా ప్రచురించాలనే ఆలోచన ఉంది. పాటలతో పాటు ప్రయాణాలన్నా చాలా ఇష్టం. దాదాపు పాతిక దేశాలు ప్రయాణం చేశాను. వాటిలో ఇరవై దేశాల ప్రయాణ అనుభవాలను ‘నా విహంగ యానం – విదేశీ విహారం’ పేరుతో ఒక పుస్తకంగా తెచ్చాను.
మహిళలకు మీరిచ్చే సందేశం?
సహజంగా మహిళలలో ఏదో ఒక కళ అంతర్గతంగా దాగి ఉంటుంది. అది పాట, నృత్యం, కళారూపాల తయారీ, చిత్రలేఖనం ఇలా ఏదైనా సరే మీలోకి మీరు అవలోకిస్తే జవాబు మీకే తెలుస్తుంది. ఆ కళను వదిలేయకుండా అభివృద్ధి చేసుకోండి. కుటుంబ బాధ్యతలు ఉంటూనే ఉంటాయి. మన మనసును సేదదీర్చే, స్వాంతన చేకూర్చే ఒక కళను సాధన చేసి గుర్తింపు పొందండి. చిన్న గుర్తింపు అయినా సరే మీలో ఒక ధైర్యాన్ని నింపుతుంది. ఆ కళ ఒక్కోసారి మీ ఆర్ధిక స్థితిగతులను కూడా మెరుగుపరుస్తుంది. అదే మిమ్మల్ని ఊహించనంత ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది.
– పాలపర్తి సంధ్యారాణి