నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. ఓ యువకుడిని హత్యచేసిన దుండగులు.. మృతదేహాన్ని అతని ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోల్కు చెందిన జయప్రకాష్ (22) అనే యువకుడు బొల్లారం కేబీఆర్ కాలనీలో ఉంటున్నారు. తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో జయప్రకాష్ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. సోమవారం తెల్లవారుజామున శవాన్ని అతని ఇంటిముందు పడేసి పోయారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను జల్లడ పడుతున్నారు.