నవతెలంగాణ-హైదరాబాద్: ఆధార్ సేవలు మరింత సులభతరంచేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ సేవలను మరింత సులువుగా పొందడానికి యూఐడీఏఐ క్యూఆర్ కోడ్ ఆధారిత ఈ-ఆధార్ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. అలాగే, కొత్త యూఐడీఏఐ మొబైల్ యాప్ను ప్రారంభించనుంది. ఈ ఏడాది చివరి నాటి దేశవ్యాప్తంగా ప్రజలకు ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇక దీంతో ప్రజలు తమ గుర్తింపును డిజిటల్గా ధ్రువీకరించుకోవచ్చు.ఫిజికల్ ఆధార్ కార్డు కాపీలను తీసుకెళ్లాల్సిన, సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తక్షణమే గుర్తింపు వెరిఫికేషన్ చేయవచ్చు. క్యూఆర్కోడ్ వ్యవస్థ ప్రభుత్వ డేటాబేస్ల నుంచి నేరుగా సమాచారాన్ని సేకరిస్తుంది. దీంతో గుర్తింపు మోసాలను తగ్గుతాయి. అలాగే ఆధార్ వెరిఫికేషన్ను సురక్షితంగా, సులభంగా ఉండేలా చేస్తుంది. అలాగే, యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ల నుంచే పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. దీని వల్ల ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే, ఫింగర్ప్రింట్, ఐరిస్ స్కాన్ల వంటి బయోమెట్రిక్ వెరిఫికేషన్లకు మాత్రం ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లాలి.