Friday, April 3, 2026
E-PAPER
Homeఆటలుఅభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో భారీ కోత..

అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో భారీ కోత..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో అసభ్య పదజాలం వాడినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా జత చేశారు.

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ను అభిషేక్ ఉల్లంఘించినట్టు మ్యాచ్ రిఫరీ నిర్ధారించారు. మైదానంలో ఆటగాళ్లు వాడే అసభ్యకరమైన లేదా అవమానకరమైన భాష.. స్టంప్ మైకుల ద్వారా గానీ, ఇతర మార్గాల్లో గానీ ప్రేక్షకులకు వినిపిస్తే ఈ నిబంధన వర్తిస్తుంది. ఇది లెవల్ 1 తప్పిదం కిందకు వస్తుందని, అభిషేక్ తన తప్పును అంగీకరించి, మ్యాచ్ రిఫరీ విధించిన శిక్షకు కట్టుబడి ఉన్నాడని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. లెవల్ 1 ఉల్లంఘనలకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది.

అయితే, అభిషేక్ ఎందుకు అసభ్యంగా ప్రవర్తించాడనే దానిపై ఐపీఎల్ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు. కానీ, తన వివాదాస్పద ఔట్ పట్ల తీవ్ర అసహనంతోనే అతను అలా ప్రవర్తించి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డీప్‌లో క్యాచ్ ఇవ్వగా, థర్డ్ అంపైర్ పలుమార్లు సమీక్షించినా క్యాచ్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ అంపైర్ అతన్ని ఔట్‌గా ప్రకటించడంతో అభిషేక్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఈ వివాదం పక్కన పెడితే, ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడు. కేవలం 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి సన్‌రైజర్స్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 226 పరుగులు చేయగా, కేకేఆర్‌ను 161 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది. ఏప్రిల్ 5న సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -