– రికార్డుల పరిశీలన
– శిథిలావస్థకు చేరిన భవనం,శుభ్రత లేని మరుగుదొడ్లు
నవతెలంగాణ-నర్సాపూర్
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మహమ్మదాబాద్ గ్రామ సమీపంలో ఉన్న ఎస్టీ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం ఏసీబీ, మున్సిపల్, శానిటేషన్, లీగల్, మెట్రాలజీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని స్టాక్ మెనూ రికార్డులను, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ.. డీఐజీ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలో పాఠశాలలో పారిశుద్ధ్య లోపం, శిధిలావస్థకు చేరిన స్కూల్ భవనం, విద్యార్థులకు మూత్రశాలలో నీటి సౌకర్యం లేకపోవడంతో అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. మరుగుదొడ్లు, వంట గదిలో పరిశుభ్రత లేకపోవడంతో పాటు హాస్టల్కు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతి రోజూ భోజనం వడ్డించాలని తెలిపారు. ఈ తనిఖీలో ఏసీబీ సీఐలు రమేష్, వెంకటేశ్వర్లు, మున్సిపల్, శానిటేషన్, మెట్రాలజీ అధికారులు ఉన్నారు.