నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని మహిబాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ పై దాడికి పాల్పడిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో గ్రామాన్ని తమ భుజస్కందాలపై మోస్తున్న పంచాయతి కార్యదర్శి పై దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు.
మహిబాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయకుమార్ బుధవారం తన విధి నిర్వాహణ లో భాగంగా ఇంటి పన్నులు వసూలు చేసే క్రమంలో అదే గ్రామానికి చెందిన కారేగామ అశోక్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడని ఆ సమయంలో విధులకు ఆటంకం కలిగిస్తూ, దుర్భాషలాడారని అన్నారు. గ్రామస్తులు అందరి ముందే భౌతికంగా దాడి చేశారన్నారు. పంచాయతీ కార్యదర్శి పై దాడికి పాల్పడిన నిందితుడి పై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మరియు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఫిర్యాదు చేసామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.