నవతెలంగాణ -హైదరాబాద్: నటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్చారు. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల మీడియాకు చెప్పారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు.
ఫిష్ వెంకట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్. చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్ని, అత్తారింటికి దారేది, డీజే టిల్లు తదితర హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.