నవతెలంగాణ-హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా తన ఫోటోలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడుతున్న అశ్లీల చిత్రాలను అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐశ్వర్య పేర్కొంది.
అయితే ఈ కేసు నేడు విచారణకు రాగా.. ఐశ్వర్య తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ సందీప్ సేథీ మాట్లాడుతూ.. మా క్లయింట్(ఐశ్వర్య రాయ్) చిత్రాలు కానీ, రూపం కానీ ఉపయోగించుకునే హక్కు ఎవరికీ లేదు. ఒక వ్యక్తి ఆమె పేరు ముఖాన్ని ఉపయోగించి AI ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు అని సేథీ వాదించారు. ఆమె పేరు రూపం ఎవరిదో లైంగిక కోరికలు తీర్చడానికి ఉపయోగించబడుతోంది. ఇది చాలా దురదృష్టకరం అని ఆయన కోర్డు ముందు పేర్కొన్నారు. అయితే ఐశ్వర్య పిటిషన్ని విచారించిన జస్టిస్ తేజస్ కరియా దీనిపై ప్రతివాదులకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 7న జాయింట్ రిజిస్ట్రార్ ముందుకి.. ఆ తర్వాత జనవరి 15, 2026న కోర్టు ముందుకి వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది.