నవతెలంగాణ – హైదరాబాద్: నటి రమ్యకు హీరో దర్శన్ అభిమానుల నుంచి లైంగిక బెదిరింపులు వస్తుండడం పట్ల ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ స్పందించారు. ఒక మహిళను ఈ విధంగా వేధించడం సరికాదని స్పష్టం చేశారు. “తల్లి, అక్క, భార్య, కూతురు.. ఇలా మహిళలను గౌరవించడం ముఖ్యం. అంతకంటే ముఖ్యంగా మహిళను కూడా ఓ వ్యక్తిగా గౌరవించాలి. నటి రమ్యపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను నేను ఖండిస్తున్నాను. ఆమెపై ఉపయోగిస్తున్న భాష ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు.
సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణ కోసం ఉపయోగించాలే తప్ప, ఇతరులను అసభ్యకరంగా వేధించడానికి కాదు. రమ్యా… నువ్వు సరైన మార్గంలోనే వెళుతున్నావు… ఈ విషయంలో నీ పోరాటానికి మేం మద్దతుగా నిలుస్తాం… నీకు తోడుగా ఉంటాం” అని శివరాజ్ కుమార్ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. కాగా, దర్శన్ అభిమానులు తనను బెదిరిస్తుండడం పట్ల రమ్య బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో తనకు పంపిస్తున్న బెదిరింపు సందేశాలు, అశ్లీల పోస్టుల స్క్రీన్ షాట్లను ఆమె పోలీసులకు అందజేశారు. రేణుకాస్వామి హత్య విషయంలో ఇటీవలే రమ్య సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అప్పటినుంచి దర్శన్ అభిమానులు ఆమెను టార్గెట్ చేశారు. రేణుకాస్వామి బదులు నిన్ను చంపి ఉండాల్సిందంటూ ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.