‘మిత్రోన్… మేం అధికారంలోకొస్తే ఒక్కో భారతీయుడి అకౌంట్లోకి రూ.15 లక్షలు వేస్తామని చెప్పి, పదకొండేండ్లు అయ్యింది..రూ.15 లక్షలు కాదుగదా.. కనీసం 15 పైసలు కూడా రాలే. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి.. ఉన్న ఉద్యోగాలను ఊడబీకేస్తున్రు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ పేరుతో చిన్నా చితకా వ్యాపారుల మీద దెబ్బకొట్టిన్రు. కరోనా పేరుతో గూగుల్ పే, ఫోన్ పే అంటూ రకరకాల వేషాలేస్తున్రు. మున్ముందు వాటికి కూడా ఛార్జీలను వసూలు జేస్తరంట. బ్యాంకుల మనం డబ్బులు దాసిపెడ్తెనేమో మిత్తి తక్కువ. అదే బ్యాంకు నుంచి మనం లోన్లు తీసుకుంటెనేమో ఇంటరెస్ట్ ఎక్కువ. గిట్లుంది కమలం పార్టీ పాలన…’ ఇది మొదటి వ్యక్తి ఆవేదన.
‘అది పచ్చి మనువాద పార్టీ. మన బహుజనులను తొక్కేసే పార్టీ. గసువంటి పార్టీకి తెలంగాణలో జనాలు ఎనిమిది ఎంపీ సీట్లిచ్చిన్రు. అంబేద్కర్ సారు రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగ పక్కనబెట్టి వాళ్లు మనువాదాన్ని ప్రమోట్ చేసుకుంటున్నరు. పొద్దుగాల్లేస్తే మనోళ్లు,మందోళ్లు, మన ధర్మం, పరాయి మతమంటూ చిచ్చుపెట్టుడు తప్ప పువ్వు పార్టోళ్లు జేసిందేమీ లేదు.. దాన్ని ఇక్కడ రాకుండా జేయాలంటే కమ్యూనిస్టులు, బహుజనులు కలిసి పోరాడాలే… ఆపరేషన్ కగార్ పేరుజెప్పి పాపం ఎంతమందిని జంపుతున్నరు…’ ఇది రెండోవ్యక్తి ఆక్రందన. వారిద్దరూ ఈ విధంగా ఓ పావుగంట మాట్లాడుకున్న తర్వాత…’పువ్వు పార్టోళ్ల గురించి ఆడ (ఉత్తర భారతం) అర్థమైంది. మనోళ్లకు అది అర్థంగాక ఏదేదో ఊహించుకుంటున్నరు. ఈడ (తెలంగాణలో)గూడ అర్థంగావాలే.. అప్పుడుగానీ జనాలకు అసలు కథ సమజై తది…’ అని ఓ ముక్తాయింపునిచ్చుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో చలికి ఓకప్పు టీ తాగుదామని హిమాయత్ నగర్లోని ఓ కేఫ్కు వెళితే…అక్కడ చెవినపడ్డ ఇద్దరు మిత్రుల సంభాషణిది.
-బి.వి.యన్.పద్మరాజు
ఆడా… ఈడా…
- Advertisement -
- Advertisement -