నవతెలంగాణ-హైరదాబాద్: ఏపీలోని రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనపై NHRC (National Human Rights Commission of India) సుమోటోగా చర్య తీసుకుంది. ఈ ఘటనపై సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల లోపు ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటనను సీరియస్గా పరిగణిస్తూ, భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.
కాగా, గత నెల ఫిబ్రవరి 16వ తేదీన రాజమండ్రిలో కల్తీ పాల ఘటన చోటు చేసుకుంది. కల్తీ పాలు తాగి 16 మంది మృతి చెందారు. పాలల్లో ఇథైలిన్ గ్లైకాల్ అనే ప్రమాదకర రసాయనం కలిసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ పాలు తాగిన వారిలో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనతో తీవ్ర అనారోగ్యం పాలైన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాల వ్యాపారి ఎ. గణేశ్వరరావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.



