– ముగ్గురు నిందితుల అరెస్ట్
– 308 కిలోల కల్తీ పత్తి విత్తనాలు స్వాధీనం
– కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : ఎస్పీ నరసింహ
నవతెలంగాణ- సూర్యాపేట
కల్తీ పత్తి విత్తనాలు తయారు చేసి రైతులకు విక్రయిస్తున్న ముఠాను మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న పరికరాలను, 308కిలోల కల్తీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్టు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ yల్లడించారు. తిరుమలగిరికి చెందిన రైతు సింగారపు యాదగిరి స్వామి తన భూమితోపాటు ఇతరుల భూములను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. పంట దిగుబడి తక్కువగా రావడంతో, పండించిన పత్తి గింజల ద్వారా విత్తనాలు తయారు చేసి అమ్ముకోవచ్చని యూట్యూబ్లో చూశాడు. తర్వాత కల్తీ విత్తనాల తయారీ కోసం 3ఫేజ్ హెచ్పి మోటార్, డ్రమ్ములు, సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాన్లు, షైన్ స్టార్ రసాయనాల డబ్బాలు వంటి పరికరాలు సేకరించాడు. కౌలుకు తీసుకున్న భూమిలో పత్తి పంట వేసి సుమారు 308 కిలోల పత్తి విత్తనాలు తయారు చేశాడు. అనంతరం ఈ విత్తనాలను ఒరిజినల్ బీటీ-3 విత్తనాలంటూ నమ్మించి, ప్యాకెట్ను రూ.1500కి విక్రయించేందుకు ప్రయత్నించాడు. తనకు పరిచయం ఉన్న నందాపురం గ్రామానికి చెందిన నవీన్, చిర్రగూడూరు గ్రామానికి చెందిన సోమనారాయణకు ఈ విత్తనాలను తక్కువ ధరకు ఇచ్చి ఎక్కువ ధరకు అమ్ముకోవాలని సూచించాడు. తొలి విడతగా వారికి 10 కేజీల చొప్పున ఇచ్చిన యాదగిరి, వారి నుంచి మళ్లీ డిమాండ్ రావడంతో నవీన్కు మరో 50 కేజీలు, సోమనారాయణకు 40 కేజీలు అందించాడు.
పక్కా సమాచారం మేరకు జిల్లా సీసీఎస్, తిరుమలగిరి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నిందితుల వ్యవసాయ భూముల వద్ద, నివాసాల్లో దాడులు నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి విత్తనాల ప్రాసెసింగ్ మోటార్, డ్రమ్ములు, సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాన్లు, షైన్ స్టార్ డబ్బాలు వంటి సామగ్రిని, సుమారు రూ.4.62 లక్షల విలువైన 308 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. సింగారపు యాదగిరిస్వామి, లొడంగి నవీన్, చిత్తలూరి సోమనారాయణను అరెస్టు చేశారు.
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ
కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ నర్సింహ హెచ్చరించారు. రైతులను మోసం చేస్తూ కల్తీ విత్తనాల తయారీ, విక్రయం చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. రైతులు నాణ్యమైన విత్తనాల కోసం వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని, అధికారిక లేబుల్లు ఉన్న నమ్మదగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఎస్ఐ హరికృష్ణ, ఏఎస్ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుళ్లు విద్యాసాగర్ రావు, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, కర్నాకర్, కానిస్టేబుళ్లు ఆనంద్, మల్లేశ్, సతీష్, శివకృష్ణ, ప్రభాకర్, మహిళా హోంగార్డ్ మంజులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవిందర్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్, తిరుమలగిరి ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కల్తీ విత్తనాలు, పరికరాలు సీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES