నవతెలంగాణ-హైదరాబాద్: భారత పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ గురువారం న్యూఢిల్లీ చేరుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్లో అష్రఫ్ఘనీ ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత.. ఆఫ్ఘన్ నుండి ఇది మొదటి ఉన్నతస్థాయి పర్యటన కావడం గమనార్హం. ఆరోరోజుల పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో భేటీ కానున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముత్తాఖీ దారుల్ ఉలూమ్ దేవ్బంద్ సెమినరీ, తాజ్ మహల్ను సందర్శించనున్నట్లు పేర్కొన్నాయి.
న్యూఢిల్లీ చేరుకున్న ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీకి హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సమస్యలపై ఆయనతో చర్చలు జరపనున్నామని అన్నారు.