Wednesday, May 14, 2025
Homeమానవివ‌య‌సు కేవ‌లం ఓ సంఖ్య మాత్ర‌మే..

వ‌య‌సు కేవ‌లం ఓ సంఖ్య మాత్ర‌మే..

- Advertisement -

విద్యా సింగ్‌… మౌంట్‌ కిలిమంజారోను అధిరోహించిన అతి పెద్ద వయసున్న భారతీయ మహిళ. 72 ఏండ్ల వ్యాపారవేత్త, సామాజ సేవకురాలు, అథ్లెట్‌. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపే ఈమె వయసును ధిక్కరించి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఏ పర్వతం ఎక్కడానికైనా వయసుతో సంబంధం లేదని నిరూపించారు.
మార్చి 13న విద్యా సింగ్‌ సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన భారతదేశంలోనే అతి పెద్ద మహిళగా నిలిచారు. 2013లో ట్రెక్కింగ్‌ పట్ల మక్కువ చూపిన చెన్నైకి చెందిన ఈమె మెంటోక్‌ కాంగ్రి, మచు పిచ్చుతో సహా భారతదేశం, భూటాన్‌, దక్షిణ అమెరికా అంతటా 19 ఎత్తైన పర్వతారోహణలను పూర్తి చేసింది. ఫిట్‌నెస్‌ కోసం ఏండ్ల తరబడి నిరంతర ప్రయత్నాలు చేసి, క్రీడల పట్ల అమితమైన ప్రేమ చూపిన ఈమెలో ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలనే భావన వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం రాజకుటుంబంలో జన్మించిన విద్యా సింగ్‌ జీవితం సాధారణమైనది కాదు. ‘స్వాతంత్య్రానికి ముందు 1945లో మా పెద్దనాన్న చివరిగా మహారాజుగా పట్టాభిషేకం చేశారు’ అని ఆమె చెప్పారు. మద్రాసు (ఇప్పుడు చెన్నై)లో పెరిగిన ఆమె చర్చి పార్క్‌, స్టెల్లా మారిస్‌ కళాశాల వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో చదువుకున్నారు. ఆమె తండ్రి గోల్ఫ్‌, టెన్నిస్‌ ఆడేవారు. గుర్రపు స్వారీ చేసేవారు. ఆమె తల్లి అద్భుతమైన టెన్నిస్‌ క్రీడాకారిణి. 13, 14 ఏండ్ల వయసులో టెన్నిస్‌ టోర్నమెంట్లలో తన తల్లితో కలిసి ఆడడం మొదలుపెట్టారు. ‘మేము టోర్నమెంట్‌ గెలిచి, పత్రికలలో నిలిచాము. ఈ టోర్నమెంట్‌ గెలిచిన మొదటి తల్లి-కూతురు జట్టు (మహిళల డబుల్స్‌) మాది’ అని ఆమె గర్వంగా గుర్తుచేసుకున్నారు.
విద్య చదువుకునే రోజుల్లో మద్రాస్‌ విశ్వవిద్యాలయ మహిళా టెన్నిస్‌ జట్టుకు నాయకత్వం వహించారు. మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలుచుకున్నారు. ప్రతి వారాంతంలో తన సైక్లింగ్‌ గ్రూప్‌ ‘ది స్పోక్స్‌పర్సన్స్‌’తో కలిసి 50-60 కి.మీ. సైకిల్‌ తొక్కేవారు. ఆమె మారథాన్‌లు కూడా నడిపారు. గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టపడ్డారు. క్రీడలతో పాటు విద్య తన మిగతా సమయాన్ని మహిళా సంస్థలు, సేవా కార్యక్రమాలకు అంకితం చేసారు. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ మహిళా సంఘం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఖీ×జజ× ఖీూఉ, సోరోప్టిమిస్ట్‌ ఇంటర్నేషనల్‌తో చురుకుగా పాల్గొంది. నిరాశ్రయులైన, మానసిక వికలాంగ పిల్లల కోసం కరుణై స్కూల్‌కు పోషకురాలిగా ఉన్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఆమె తన భాగస్వామి రంగరాజ్‌తో కలిసి ఈవెంట్‌ ప్లానింగ్‌ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
కిలిమంజారో శిఖరానికి మార్గం
కిలిమంజారో ‘ట్రెక్కబుల్‌ శిఖరం’ అయినప్పటికీ తీవ్రమైన అడ్డంకులు కచ్చితంగా ఉంటాయని విద్య అంటున్నారు. అయితే చెన్నైకి చెందిన ట్రెక్కింగ్‌ కంపెనీ గెట్‌ అప్‌ అండ్‌ గోతో ట్రెక్కింగ్‌ చేయడం ఆమెకు ఎప్పటి నుండో ఒక లక్ష్యం. కిలిమంజారో యాత్ర కోసం ఆ బృందంలో 10 మంది ఉన్నారు. ట్రెక్కర్లకు గైడ్‌లు మద్దతు ఇస్తారు. కిలిమం జారో సాధారణంగా ఎనిమిది రోజుల ట్రెక్‌. విద్య 6వ రోజు రాత్రి శిఖరాగ్రానికి ఎక్కడం ప్రారంభమవుతుంది. ప్రయాణంలో అత్యంత బాధాకరమైన భాగం 5వ రోజున బారంకో గోడను ఎక్కడం అని విద్య గుర్తుచేసుకున్నారు. ఇది 900 అడుగుల నిలువు కొండ. క్యాంప్‌సైట్‌ మీదుగా దూసుకుపోతున్న దాన్ని చూడటం, జయించడం అసాధ్యమైన అడ్డంకిగా అనిపించింది. ‘మేము సాయంత్రం శిబిరానికి చేరుకున్నప్పుడు దాన్ని చూశాము. ‘వామ్మో.. మనం ఈ కొండను ఎలా ఎక్కబోతున్నాం?’ అని అనుకున్నాము’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. బారంకో వాల్‌ పైకి రెండున్నర గంటల పాటు ఎక్కడంతో విద్య శారీరక, మానసిక పరిస్థితి పరీక్షించింది. ‘వాస్తవానికి ఇది చాలా సవాలుగా ఉంది. కానీ మనలో ప్రతి ఒక్కరూ దాన్ని ఆస్వాదించారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు మీ కాలు పెట్టలేని ఇరుకైన రాళ్లపైకి ఎక్కడం, తర్వాత మరొకదానికి ఎక్కడం అనే సవాలును మేము నిజంగా ఆస్వాదించాం’ అంటారు ఆమె.
6వ రోజు రాత్రి 10.30 గంటలకు శిఖరాగ్రానికి ఎక్కడం ప్రారంభమైంది. ట్రెక్కర్లు గైడ్‌లను అనుసరించడానికి హెడ్‌ల్యాంప్‌లు మాత్రమే మార్గాన్ని వెలిగించాయి. ‘మార్గాలు ఇరుకైనవి, వంకరగా ఉంటాయి. కాబట్టి ఇది ఎత్తులో ఎక్కడాన్ని సులభతరం చేస్తుంది’ అని విద్య వివరించారు. రాత్రిపూట గంటల తరబడి ఎక్కిన తర్వాత తెల్లవారుజామున ఆ బృందం స్టెల్లా పాయింట్‌కు చేరుకుంది. ఆపై కిలిమంజారో చేరుకోవడానికి మరో 45 నిమిషాలు ట్రెక్కింగ్‌ చేసింది. ‘అక్కడ దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ మైనస్‌ 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు, శిఖరాన్ని చేరుకోవడానికి ఎక్కువ మంది అధిరోహకులు వేచి ఉండటంతో అక్కడ ఎక్కువసేపు ఉండటం కష్టం’ అని ఆమె వివరించారు.
క్రమశిక్షణ పరిమితులను ధిక్కరిస్తుంది
వయసు పెరుగుతున్నప్పటికీ వారసత్వంగా వచ్చిన ఫిట్‌నెస్‌ ఆమెకెంతో సహాయపడింది. విద్య వారానికి రెండుసార్లు బరువులు ఎత్తడం, ప్రతి ఆదివారం సైకిల్‌ తొక్కడం, వారానికి రెండుసార్లు ఈత కొట్టడం, ప్రతిరోజూ 30 నిమిషాల పాటు థ్రెడ్‌ మిల్‌ను ఉపయోగిస్తుంది. ప్రతి ట్రెక్‌కు ముందు ఐదు వారాల పాటు ఆమె నగరంలోని సెయింట్‌ థామస్‌ మౌంట్‌, తిరుసులం కొండలను అధిరోహిస్తుంది. ఇది ఆమెకు మానసిక క్రమశిక్షణకు కూడా ఉపకరిస్తుంది. ‘ఇది మీరు రిస్క్‌ తీసుకోలేని ప్రదేశం. ప్రతి అడుగును గమనించాలి. పడిపోయి ఎముక విరిగిపోవడం, తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రమాదం ఉంది. అందుకే ఎక్కేటప్పుడు స్పృహతో, జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె నొక్కి చెబుతున్నారు.
‘మీరు పర్వతాలలో ఎంత ఎక్కువగా ఉంటే, అవి మీ ఆత్మలోకి చొచ్చుకుపోతాయి. అక్కడ మీకు ఏదో జరుగుతుంది. ఈ ప్రకృతి సౌందర్యం ముందు మానవులు ఎంత అల్పులో అనిపిస్తుంది’ అంటు న్నారు. ఆమె దృష్టి ఇప్పుడు యూరప్‌ లోని ఎత్తైన శిఖరమైన మౌంట్‌ ఎల్బ్రస్‌, ఫుజి పర్వతంపై ఉంది. ఎవరెస్ట్‌ గురించి అడిగినప్పుడు ఆమె 40 ఏండ్ల కిందట ప్రారంభించి ఉంటే అది కూడా పూర్తి చేయగలిగే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు అది తనకు అందుబాటులో లేదని ఆమె అంగీకరించారు. అయితే మహిళలు వయసు వల్ల తమ ఆలోచనలను పరిమితం చేసుకోకూ డదని నమ్ముతున్నారు. ‘వయసు ఒక కారణం కాదు. మీరు చేయాలనుకు నేది ఏదైనా చేయకుండా అది మిమ్మల్ని ఆపకూడదు. మీరు ట్రెక్కింగ్‌ ప్రారంభించిన తర్వాత మీరు దానికి బానిస అవుతారు’ అని ఆమె అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -