నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా పెను ప్రమాదంపై తాజాగా యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 169 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే 53 మంది బ్రిటన్ జాతీయులు… ఉన్నట్లు సమాచారం. ఏడు మంది పోర్చుగీస్ అలాగే ఓ కెనడియన్ ఉన్నాడని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ పెను ప్రమాదంపై టాటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా 171 విమానం ప్రమాదానికి గురి కావడం విషాదకరమని పోస్ట్ పెట్టింది. అలాగే మృతుల కుటుంబాలకు అటు క్షతగాత్రులకు టాటా గ్రూప్ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది .
బాధితులకు అండగా ఉంటామని, ఆదుకుంటామని టాటా గ్రూప్ కూడా స్పష్టం చేసింది. ఈ ప్రమాదంపై విచారణ చేయిస్తామని… ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.
గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం.. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే మేఘానిలో సివిల్ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అలాగే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.