నవతెలంగాణ హైదరాబాద్: స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో దేశీ బ్రాండ్ ఫోన్ ప్రవేశించింది. రియల్మీ ఇండియా, హానర్ మాజీ సీఈఓ మాధవ్ సేథ్ నెక్ట్స్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ పేరిట కొత్త కంపెనీని నెలకొల్పారు. ఈ సంస్థ తాజాగా ఏఐ+ బ్రాండ్ పేరుతో మంగళవారం రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఏఐ+ పల్స్ (4జీ స్మార్ట్ఫోన్), నోవా (5జీ స్మార్ట్ఫోన్)లను నెక్ట్స్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ విడుదల చేసింది. భారత్ను దృష్టిలో పెట్టుకుని ఏఐ+ స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చినట్టు మాధవ్ సేథ్ తెలిపారు. డిజైన్, వేగంతో పాటు డేటా భద్రతకు పెద్దపీట వేస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు.
ఏఐ+ పల్స్, ఏఐ+ నోవా రెండు ఫోన్లలోనూ 6.7 అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. 90Hz, 120Hz రిఫ్రెష్రేట్కు సపోర్ట్ చేస్తాయి. ఏఐ+ పల్స్లో Unisoc టీ615, నోవా 5జీలో Unisoc T8200 ప్రాసెసర్లను అమర్చారు. ఏఐ ప్లస్ పల్స్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB + 64GB వేరియంట్ ధర రూ.4,999గా నిర్ణయించారు. 6GB + 128GB వేరియంట్ ధర రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది.
ఏఐ ప్లస్ నోవా 5జీ
ఏఐ ప్లస్ నోవా 5జీ కూడా రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.7,999గా, 8GB + 128GB వేరియంట్ ధర రూ.9,999గానూ నిర్ణయించారు. పల్స్ మోడల్ జులై 12 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉండనుంది. నోవా 5జీ 13 నుంచి విక్రయానికి రానుంది.
బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, పర్పుల్ కలర్స్లో లభిస్తాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత NXTQ ఓఎస్తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. రెండు ఫోన్లలోనూ 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. రెండింట్లోనూ 5k ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.