నవతెలంగాణ – హైదరాబాద్ : విమాన ప్రయాణాల్లో భద్రత, సిబ్బంది వ్యవహారాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠినంగా వ్యవహరిస్తోంది. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిన అనంతరం డీజీసీఏ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎయిరిండియాకు తాజాగా నాలుగు నోటీసులు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది విశ్రాంతి, శిక్షణ నిబంధనలు, నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగినట్లు ఎయిరిండియా అంగీకరించినట్లు సమాచారం.
భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి గత ఆరు నెలల్లో ఎయిరిండియాకు డీజీసీఏ తొమ్మిది షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పౌర విమానయాన శాఖ ఇటీవల రాజ్యసభకు తెలియజేసింది. ఉల్లంఘనలకు సంబంధించి తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.