నవతెలంగాణ – హైదరాబాద్ :అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద విషాదం నుంచి దేశం ఇంకా తేరుకోకముందే ఎయిరిండియాకు చెందిన మరో విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గాల్లో ఒక్కసారిగా 900 అడుగుల కిందకు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జూన్ 14న ఢిల్లీ నుంచి వియన్నాకు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 777 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం కారణంగా విమానం అకస్మాత్తుగా భూమివైపు దూసుకెళ్లింది. 900 అడుగుల మేర కిందకి దిగడంతో వెంటనే ప్రమాద హెచ్చరిక సిగ్నల్స్ మోగాయి. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని తమ నియంత్రణలోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికి అహ్మదాబాద్ దుర్ఘటన జరిగి రెండు రోజులు మాత్రమే అయింది. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా పరిగణించింది. తక్షణమే విచారణకు ఆదేశించడమే కాకుండా, ఆ విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జూన్ 17న ఎయిరిండియా భద్రతా విభాగాధిపతికి డీజీసీఏ సమన్లు జారీ చేసింది.