నవతెలంగాణ – హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అఖండ 2′ సినిమా విడుదల వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నామని నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్లస్’ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాత్రి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. “భారీ హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ‘అఖండ 2’ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయడం లేదు. ఇది మాకు కూడా ఎంతో బాధ కలిగించే విషయం. సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతీ అభిమాని నిరాశను మేము అర్థం చేసుకోగలం,” అని నిర్మాతలు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని చిత్రబృందం తెలిపింది. ఈ జాప్యానికి, అసౌకర్యానికి ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు వివరించింది. “మీ మద్దతే మాకు కొండంత బలం. త్వరలోనే ఒక సానుకూల అప్డేట్తో మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నాం,” అని నిర్మాతలు తమ ప్రకటనలో భరోసా ఇచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ‘అఖండ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ముందుగా గురువారం రాత్రి ప్లాన్ చేసిన ప్రీమియర్స్ ను రద్దు చేసినట్లు ప్రకటించిన నిర్మాణ సంస్థ, కొద్ది గంటల వ్యవధిలోనే చిత్రం విడుదల వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తాజా ప్రకటనతో అభిమానులు నిరాశకు గురైనప్పటికీ, కొత్త విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


