నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల జూన్ 21 ‘యోగా డే’కు హాజరుకాని ఉద్యోగులకు నెల జీతాన్ని నిలిపివేయనున్నట్లు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఐఐ) ప్రకటించింది. ముందస్తు సమాచారం లేకుండా ఈ కార్యక్రమానికి గైర్హాజరైన ఉద్యోగులకు ఈ నెల జీతాన్ని నిలిపివేస్తామని సోమవారం డబ్ల్యుఐఐ ఒక ప్రకటన జారీ చేసింది. అయితే కొన్ని గంటల తర్వాత ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటూ మరో ఇ-మెయిల్ పంపినట్లు సమాచారం. డబ్ల్యుఐఐ సిబ్బందికి సాధారణ ఇమెయిల్ పంపిందని, కానీ అటువంటి చర్య ఏమీ ప్రతిపాదించలేదని డబ్ల్యుఐఐ డైరెక్టర్ వీరేంద్ర తివారీ పేర్కొన్నారు.
డబ్ల్యుఐఐ నోటీసులు జారీ చేసినప్పటికీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి సమాచారం ఉన్నప్పటికీ.. శనివారం నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో హాజరుశాతం తక్కువగా ఉండటంపై ఈ సంస్థ పంపిన ఇమెయిల్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన జాతీయ కార్యక్రమంలో 75మంది మాత్రమే హాజరైనప్పటికీ.. 600 మందికి పైగా ఉద్యోగులు ( పరిశోధకులు సహా) నెలవారీ జీతాలు/భత్యాలు డబ్ల్యుఐఐ సకాలంలో అందిస్తుందని గమనించండి ” అని ఉద్యోగులకు పంపిన ఇమెయిల్ పేర్కొంది. అయితే ముందస్తు సమాచారం లేకుంగా గైర్హాజరైన ఉద్యోగులు లిఖిత పూర్వక వివరణను సమర్పించాలి అని అందులో పేర్కొంది. శాశ్వత మరియు కాంట్రాక్ట్ సిబ్బంది తమ రిపోర్టింగ్ అధికారికి లేదా డిప్యూటీ రిజిస్ట్రార్కు వివరణలను సమర్పించాలని యంత్రాంగం ఆదేశించింది.
హాజరు రికార్డు, టూర్ వివరాలు, చెల్లుబాటు అయ్యే వ్రాతపూర్వక వివరణలు సమర్పించి, ధ్రువీకరించబడే వరకు జూన్ 2025 జీతం విడుదలను నిలిపివేయాలని సంబంధిత అధికారిని ఆదేశించినట్లు సమాచారం. అనంతరం మధ్యాహ్నం 1.55 గంటలకు పంపిన మరో ఇ-మెయిల్లో ఆ సందేశాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.
యోగాడేకు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేయలేదని, ఇటువంటి ఇమెయిల్స్ పంపడం ఇదే మొదటిసారి అని ఒక ఉద్యోగి పేర్కొన్నారు. ఇది అందరినీ షాక్కు గురిచేసిందని అన్నారు. వివరణనివ్వమనడం కొంచెం అతిగా ఉందని మరో ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు.