నవతెలంగాణ ఢిల్లీ: సోదరభావాన్ని పెంపొందించే వేడుక ‘అలయ్ బలయ్’ అని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు. హైదరాబాద్లో నేడు ఈ పండుగ ఎంతో ఉత్సాహంగా నిర్వహించనున్నారని తెలిసి సంతోషించానని పేర్కొన్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏటా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతూ రాష్ట్రపతి సందేశమిచ్చారు.
తెలంగాణ ఆచారాలను పునరుజ్జీవింపజేయడానికి బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ పండుగను ప్రారంభించారు. ఇది సోదరభావాన్ని పెంపొందించే వార్షిక సాంస్కృతిక ఉత్సవం. అన్నివర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చి తెలంగాణకు చెందిన గొప్ప సంస్కృతిని ప్రదర్శిస్తోంది. ప్రజల్లో ఐక్యత, సమాజ విలువలను వ్యాప్తి చేసేందుకు ఓ సామాజిక సమావేశంగా ఇది ఉపయోగపడుతోంది. అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరగాలని శుభాకాంక్షలు తెలిపారు.