Thursday, June 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపిల్లలందరూ ఒకే చోట చదవాలి

పిల్లలందరూ ఒకే చోట చదవాలి

- Advertisement -

– ప్రభుత్వ బడులను కాపాడండి : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
– సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జీపుజాతా ప్రారంభం
నవతెలంగాణ-గజ్వేల్‌

చదువులో అంతరాలు పోవాలంటే పిల్లలందరూ ఒకేచోట ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని, అప్పుడే బడులకు భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సారెడ్డి అన్నారు. మంగళవారం రెండో విడత జీపుజాతాను సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేయాలని తాను ఇప్పటికే లేఖ రాసినట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అట్టడుగు వర్గాల పిల్లలు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల పిల్లలను చేర్చడం లేదన్నారు. ప్రభుత్వాలు మారినా.. ప్రభుత్వ పాఠశాలలు బలపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్సీగా ఉండి అనేకసార్లు చట్టసభల్లో చర్చించినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. తల్లిదండ్రులు లక్షల ఫీజులు చెల్లించి ప్రయివేట్‌ విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. 2025 ఫిబ్రవరిలో విద్యా కమిషన్‌తో పాటు ముఖ్యమంత్రికి 21 పేజీల రిపోర్టు అందించినట్టు చెప్పారు. ఈ రిపోర్టులో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం సంతృప్తికరంగా లేదని చెప్పినట్టు తెలిపారు.
బడీడు పిల్లల సంఖ్య ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను ఆర్గనైజింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ వంటి నగరాల్లో ప్రభుత్వం కొత్తబడులు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పది శాతం విద్యాశాఖకు కేటాయించాలని కోరారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య సంక్షోభంలో ఉన్నదని.. సమూలమైన మార్పులతో తగు చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ బడులు నిలబడతాయని అన్నారు. లేకుంటే నాలుగైదు సంవత్సరాల్లో మెజార్టీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరిక లేక మూతపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ నాయకులు లక్ష్మారెడ్డి, షేక్‌ వలిహమ్మద్‌, చంద్రారెడ్డి, సత్యనారాయణ, మంగ, నాగమణి, స్వప్న, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రశాంత్‌, సక్రియ, రవీందర్‌, సీఐటీయూ నాయకులు ఎల్లయ్య, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -