నవతెలంగాణ-హైదరాబాద్: జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు ఆమోదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ స్వాగతించింది. ఇది న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని తెలిపింది. జడ్జీలు అవినీతిపరులుగా మారితే, కోర్టులపై ప్రజలకు ఉన్న విశ్వాసం పోతుందని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ తివారీ గురువారం పేర్కొన్నారు. కోర్టుల ఉనికికి అవినీతిపరులపై చర్యలు తీసుకోవడం చాలా అవసరమని అన్నారు. ఇక్కడ ప్రశ్న జస్టిస్ యశ్వంత్ వర్మ కాదని, ప్రజల విశ్వాసం మరియు ప్రజాస్వామ్యని అన్నారు. న్యాయవ్యవస్థ విశ్వాసం కోల్పోతే, ప్రజాస్వామ్యం అంతమవుతుందని అన్నారు. ఈ అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయాలని ప్రతిపక్షపార్టీలకు విజ్ఞప్తి చేసినట్లు తివారీ తెలిపారు.
ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత స్టోర్ రూమ్ నుండి గుట్టలుగా నగదు కట్టలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 2025 మార్చి 22న అప్పటి సిజెఐ సంజీవ్ ఖన్నా ఈ అంశంపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. మార్చి 24న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వర్మను న్యాయపరమైన విధులన నుండి తొలగించింది. అనంతరం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.