నవతెలంగాణ-హైదరాబాద్: జాతీయ భద్రతలో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి జ్యోతిమల్హోత్రా కేసులో కేరళ ప్రభుత్వంపై బిజెపి ఆరోపణలు చేస్తోందని సీపీఐ ఎంపి పి.సందోష్ కుమార్ మండిపడ్డారు. గూఢచర్యం కేసులో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయన్న నివేదికలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సోమవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వం ఆహ్వానించిందన్న వార్తలను తోసిపుచ్చారు. పాస్పోర్ట్ జారీ, వీసా క్లియరెన్స్, ఇంటెలిజెన్స్ పర్యవేక్షణ అన్నీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నప్పుడు యూట్యూబర్ పాకిస్తాన్కి వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని సూచించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేరళ ప్రభుత్వం ఆమె పాకిస్తాన్ సందర్శనను ఆమోదించిందా, ఢిల్లీలోని ఐఎస్ఐ నిర్వాహకులతో ఆమెకు సంబంధాలు ఏర్పరిచిందాఅని ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని దుయ్యబట్టారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి నిందితులను ఇప్పటివరకు గుర్తించలేదు, అరెస్ట్ చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ వైఫల్యాలకు బాధ్యత వహించడానికి బదులుగా మల్హోత్రా గతంలో హాజరైన పర్యాటక కార్యక్రమానికి, ఆమె ఐఎస్ఐ నియామకాలకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ, బిజెపి కేరళ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని మండిపడ్డారు. కేంద్రం ప్రత్యక్ష అధికారపరిధిలో ఉన్న విదేశీ నిధులు, పాకిస్తాన్ పర్యటనలను విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.