– దాడిని మోడీ ఖండించాలి
– ప్రపంచ శాంతి నెలకొల్పాలి : వామపక్ష పార్టీల నేతల డిమాండ్
– హైదరాబాద్లో నిరసన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇరాన్పై అమెరికా సామ్రాజ్యవాదం సాగిస్తున్న దాడులను వామపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. యుద్ధోన్మాదాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఇంతకాలం పరోక్ష పాత్ర పోషించిన అమెరికా ఇప్పుడు వివిధ దేశాలపై నేరుగా దాడులకు తెగబడడం గర్హనీయమని అన్నారు. ఇరాన్పై అమెరికా దాడుల పట్ల భారత ప్రధాని మోడీ ఖండించాలనీ, ఈ దాడులపై ఆయన వైఖరి ప్రకటించాలని చెప్పారు. ప్రపంచ శాంతిని నెలకొల్పాలని కోరారు. ఇరాన్పై అమెరికా దాడులను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని నారాయణగూడలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, ఇరాన్పై యుద్ధం ఆపాలి, అప్ అప్ సోషలిజం, డౌన్డౌన్ కాపిటలిజం’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతోపాటు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మూడో ప్రపంచ యుద్ధంవైపు ప్రయత్నిస్తున్న ట్రంప్ : కూనంనేని
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అందులో భాగంగానే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడి చేసేందుకు ట్రంప్ సహకరించారని అన్నారు. తాజాగా ఇరాన్పై ఇజ్రాయిల్ యుద్ధానికి పుర్పిగొల్పారని చెప్పారు. ఇరాన్లో అణ్వాయుధాలున్నాయనే పేరుతో అమెరికా బాంబుల వర్షం కురిపించడం దుర్మార్గమన్నారు. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయని చెప్పారు. భారత్కు ట్రంప్ మద్దతు పలికినట్టే పలికి రెండు రోజుల్లోనే పాకిస్థాన్కు అండగా నిలిచారని అన్నారు. ఇంకోవైపు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ తనవల్లే సాధ్యమైందంటూ ప్రకటించారని చెప్పారు. భారత సౌర్వభౌమాధికారాన్ని ట్రంప్ కించపర్చినా ప్రధాని మోడీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మూడో ప్రపంచ యుద్ధంవైపు ప్రయత్నిస్తున్నా మోడీ నోరుమెదపడం లేదని అన్నారు. భారత్ అలీన విధానానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమెరికా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా మోడీ గళం విప్పాలని డిమాండ్ చేశారు.
ప్రపంచ పోలీసు పెత్తనాన్ని వ్యతిరేకించాలి : హన్మేష్
ఇంతకాలం పరోక్షంగా సహకరించిన అమెరికా ఇప్పుడు ఇరాన్పై ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నదని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హన్మేష్ విమర్శించారు. ప్రపంచ పోలీసుల్లా పెత్తనం చేస్తున్న అమెరికాను వ్యతిరేకించాలని కోరారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ ట్రంప్ పాలనలో ప్రపంచంలో అశాంతి నెలకొందన్నారు. ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా అమెరికాలోనే ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎస్యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మురహరి మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపైనే కాకుండా మానవాళిపై దాడి చేస్తున్నదని విమర్శించారు. సోషలిజంలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని అన్నారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న మాట్లాడుతూ ప్రధాని మోడీ అమెరికా సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇరాన్పై యుద్ధాన్ని ఆపేలా మోడీ ప్రయత్నించాలని కోరారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం వెంకటేశ్, సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్ ఛాయాదేవి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్బాబు, ఆర్ శ్రీరాంనాయక్, భూపాల్, ఉడుత రవీందర్, ఎం అడివయ్య, బుర్రి ప్రసాద్, సీనియర్ నాయకులు డిజి నరసింహారావు, పీఎస్ఎన్ మూర్తి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్బోస్, నగర నాయకులు కమతం యాదగిరి, స్టాలిన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు జెవి చలపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె గోవర్ధన్, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కె సూర్యం, ఎస్ఎల్ పద్మ, కెఎస్ ప్రదీప్, ఎస్యూసీఐ(సీ) హైదరాబాద్ కార్యదర్శి తేజ తదితరులు పాల్గొన్నారు.
సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం : సాదినేని
సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం, యుద్ధమంటేనే సామ్రాజ్యవాదమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. ప్రపంచ దేశాలపై పెత్తనం కోసం, వనరులను దోపిడీ చేయడం కోసమే యుద్ధం చేస్తున్నదని చెప్పారు.
సామ్రాజ్యవాద దాడుల్ని ఖండించండి : జాన్వెస్లీ
ఇరాన్పై అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న దాడులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఖండించారు. ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నదని విమర్శించారు. ఇరాన్పై దాడులను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడులను మోడీ ఖండించాలని కోరారు. ఇరాన్లో అణ్వాయుధాలున్నాయనే పేరుతో వాటి అణుక్షేత్రాలపై దాడులు చేస్తున్నామంటూ అమెరికా ప్రకటించడం సరైంది కాదన్నారు. అక్కడ అణ్వాయుధాల్లే వంటూ అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. దాడులు చేసే అధికారం అమెరికాకు ఎక్కడుందని ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానాలున్నాయని చెప్పారు. ప్రపంచ పోలీసుల్లాగా వివిధ దేశాలపై అమెరికా ఆధిపత్యం చెలాయించడం ఎంత వరకు సమంజసమని అడిగారు. ఇజ్రాయిల్కు మద్దతిచ్చి పాలస్తీనాను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులు చేసేలా సహకరించిందని అన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడానికి అమెరికా సామ్రాజ్యవాదం కారణమని విమర్శించారు. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరగడానికి కారణమవుతూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నదని చెప్పారు. ఈ దాడులకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నా, ఐక్య రాజ్య సమితి ఆపాలని కోరినా అమెరికా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి దోపిడీని కొనసాగించాలనే వ్యూహంతోనే ఇలాంటి దాడులకు పూనుకుంటున్నదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ఇలాంటి నిరసన కార్యక్రమాలపై అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పారు. అమెరికా కాన్సులేట్ వద్ద నిరసన తెలియజేయకుండా పోలీసులు దాడులు, దౌర్జన్యాలు చేశారని గుర్తు చేశారు.