నవతెలంగాణ హైదరాబాద్: ఏ.వి. కళాశాల ఆధ్వర్యంలో జనవరి 30, 31వ తేదీల్లో వృక్ష శాస్త్ర విభాగము మరియు న్యూట్రిషన్ విభాగము సంయుక్తంగా నిర్వహిస్తున్న “Prachintatva for Well-being – (ప్రాచీన తత్వం ఫర్ వెల్-బీయింగ్)” అంతర్జాతీయ సదస్సు, భారతీయ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థల ఆధారంగా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషించే మేధో చైతన్య వేదికగా నిలుస్తోంది. వైద్యం, పోషణ, సౌందర్య, శాస్త్ర రంగంలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు, ఆహార భద్రత లోపం, మానసిక ఒత్తిడి, రసాయన ఆధారిత చికిత్సల దుష్ప్రభావాలు, పర్యావరణ అసమతుల్యత వంటి సమస్యలకు భారతీయ సంప్రదాయ జ్ఞానం ఒక సమగ్ర, సహజ, సుస్థిర మార్గాన్ని సూచిస్తుందనే భావనతో ఈ సదస్సు నిర్వహించబడింది. మన సంప్రదాయాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు — అవి జీవన విధానాలు, ఆరోగ్య వ్యవస్థలు, ప్రకృతి సహజ సంబంధాలు, సమాజ సమతుల్యతను కాపాడే సంపూర్ణ జీవన తత్వాలు. “సాంప్రదాయం నుంచి పరిష్కారం దిశగా ప్రయాణం చేయడానికి ఈ సదస్సుఒక వేదికగా నిలవాలి అన్నదే మా ప్రయత్నం.” ఈ సదస్సులో పరిశోధన పత్రాలను ఐ.ఎస్.బి.ఎన్ తో ప్రచురించిన ‘ఇంటింటి మూలికా వైద్యం’ అనే పుస్తకమును ఆవిష్కరించారు.
తొలి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. కెవిజిఎస్ మూర్తి మాట్లాడుతూ మొక్కల నుండి లభించే మూలికల ఆవశ్యకతను తెలుపుతూ ఇవి ఆరోగ్య రంగంలో ఏ విధంగా ఉపయోగ పడతాయో వివరించారు. ఈ మూలికలు వైద్య, పోషణ సౌందర్య శాస్త్ర రంగంలో వీటి ప్రాధాన్యత గురించి తెలియజేశారు. యూనివర్సిటీ అఫ్ శ్రీలంక ప్రొ. దీప్తి మాట్లాడుతూ వారు చేసిన పరిశోధనలలో అనేక రకాల మొక్కల విలువలను తెలుపుతూ ఆరోగ్య రంగంలో ఆ మొక్కల ప్రాధాన్యతను వివరించారు. ఐసిఎఫ్ఆర్ఈ సభ్యులు బి ఆంజనేయ రాజు మాట్లాడుతూ మన పూర్వీకుల జీవన శైలిని వారి అనుభవాలను వివరంగా తెలియపరుస్తూ మొక్కలు, ఆహరం, సౌందర్య సాధనాలుగా ఏవిధంగా ఉపయోగపడతాయో వివరించారు.
రెండో రోజు పి. ఉమా మహేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా మొక్కలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తూ ఆ మొక్కలు ఆరోగ్య రంగంలో సౌందర్య సాధనాల తయారీలో ఏ విధంగా ఉపయోగ పడతాయో వివరించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉప కులపతి యూనివర్సిటీ అఫ్ ట్రాన్స్ డిసిప్లినరీ హెల్త్ సైన్స్ మరియు టెక్నాలజీ, బెంగుళూరు ప్రొ అనంత దర్శన్ శంకర్ మాట్లాడుతూ వారు చేసిన పరిశోధనలను వైద్యరంగంలో వాటి పాత్రను పూర్తి స్థాయిలో చెప్పారు. డా. ఫ్లోరియాన్ ప్లో బర్గర్ TCM Physician టిబెటలో జిస్ట్, యూనివర్సిటీ లెక్చరర్ ICTB అఫ్ ది యూనివర్సిటీ అఫ్ వియన్నా, ఆస్ట్రేలియా మాట్లాడుతూ అంతర్జాతీయంగా మొక్కలపై జరుగుతున్నా అనేక రకాల వ్యాధుల (కాన్సర్ వంటి మహమ్మారి) నిర్మూలనలో మొక్కల ప్రాధాన్యతను తెలియపరిచారు.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ప్రొ.కొండా రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి వాటి నిర్మూలనలో ప్రాచీన వైద్య విధానం ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. ఈ సదస్సులో ఏవిఈఎస్ కార్యదర్శి అచ్యుత ప్రసాద రెడ్డి, కళాశాల కరెస్పాండంట్ డా. కే.గౌతమి, ప్రిన్సిపల్ ప్రొ. సి.హెచ్.రాజలింగం, డా. ఎం.భగవంత రెడ్డి, పి. జి. డైరెక్టర్, సదస్సు కన్వీనర్ డా.పి.పద్మ, వై. శ్రీనివాస్ రెడ్డి, ఏ.చంద్ర శేఖర్ రెడ్డి సి. హెచ్, నాగేష్, శ్రీలక్ష్మి వివిధ యూనివర్సిటీల అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.



